
ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ నెలా వారికి పెన్షన్లను పంపిణీ చేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల విధానంలో కీలక మార్పులు చేస్తోంది. వీటి సేవలను పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి మార్చింది. వీటి కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నుంచి జారీ చేసే ప్రక్రియ వరకు ప్రతీ పనిని డిజిటలైట్ చేసింది. దీని వల్ల ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పారదర్శకత లభిస్తుందని కూటమి సర్కార్ తెలిపింది. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు సులువుగా పెన్షన్ పొందేందుకు ఈ కొత్త సంస్కరణలను తీసుకొచ్చింది.
పెన్షన్ల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించే ప్రక్రియను మే 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక నుంచి పేపర్ల విధానంలో దరఖాస్తులను స్వీకరించే విధానానికి స్వస్తి పలకనుంది. కేవలం ఆన్ లైన్ సిస్టమ్ ద్వారానే దరఖాస్తులను ఆహ్వానించాలని సూచించింది. పాత విధానంలో పేపర్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానించేవారు. దీని వల్ల దరఖాస్తులను పరిశీలించి ప్రాసెస్ చేసేందుకు చాలా ఆలస్యమవుతోంది. అయితే ఇక నుంచి పేపర్ విధానం రద్దు అవుతుంది. పెన్షన్ దరఖాస్తులతో పాటు ప్రపోజల్స్, రిటైర్మెంట్ సదుపాయాలు అన్నీ నిధి పోర్టల్ ద్వారా జరుగుతాయి. పాత విధానంలో పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అంతేకాకుండా తమ దరఖాస్తు ప్రక్రియ ఎక్కడివరకు వచ్చిందనేది తెలుసుకోవడం కష్టంగా మారేది. ఇక మధ్యవర్తుల ప్రమేయం కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పడనుంది.
ఆన్లైన్ సిస్టమ్ వల్ల పెన్షన్లు వేగంగా మంజూరు కానున్నాయి. దరఖాస్తు స్టేటస్ ఎక్కడ ఉండనేది రియల్ టైమ్లో చెక్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్లు కూడా వేగంగా ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతీ దశలోనూ పారదర్శకత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 30 వరకు మాత్రమే పేపర్ ఆధారిత విధానంలో పెన్షన్ దరఖాస్తులకు అవకాశం ఉంటుందని, మే 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 1 తర్వాత పేపర్ అప్లికేషన్లను అధికారులు తిరస్కరిస్తారు. పెన్షన్ ఫైల్స్ ప్రాసెసింగ్లో వేగం పెంచడం, జాప్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇక మధ్యవర్తుల ప్రమేయం తగ్గడం వల్ల పెన్షన్ల జారీలో అవినీతి అనేది ఉండదు. ఇక రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిధి పోర్టల్లో లాగిన్ అవ్వాలి. ఆన్ లైన్ అప్లికేషన్ నింపి డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.