
ఉగాది రోజున ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్లు అందిస్తోంది. పండుగ సందర్భంగా ఇవాళ ఉదయం నిరుద్యోగులు కానుక ప్రకటించింది. పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. దాదాపు 10 వేలకుపైగా పోస్టులను ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసింది. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తోండగా.. ఈ క్రమంలో ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఏపీలోని కార్మికుల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రకటించింది. వీటి ద్వారా కార్మికులకు పిల్లల పెళ్లికి ఆర్ధిక సాయంతో పాటు ప్రసూతికి కూడా సాయం అందించనుంది. గతంలో ఆగిపోయిన పథకాలను తిరిగి పున:ప్రారంభించింది. ఈ పథకాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
కార్మికుల సంక్షేమం కోసం నాలుగు పథకాలను తిరిగి ప్రారంభించారు. కార్మికుల పిల్లలకు పెళ్లి కానుక, ప్రసూతి ప్రయోజనం, అంత్యక్రియల ఖర్చులు, సహజ మరణం వంటి సందర్భాల్లో సహాయం అందించేందుకు నాలుగు పథకాలను తిరిగి తీసుకొచ్చింది. భవన నిర్మాణం, ఇతర కార్మికుల కుటుంబాలకు ఈ పథకాలు వర్తించనున్నాయి. కార్మికుల పిల్లల పెళ్లిళ్లకు రూ.40 వేల సాయం అందించనున్నారు. వివాహ కానుక పథకం ద్వారా ఈ సాయం అందిస్తారు. ఇక కార్మికుల ఇద్దరు కుమార్తెలకు ప్రసూతి సమయంలో రూ.20 వేల చొప్పున సాయం అందిస్తారు. ప్రసవం తర్వాత ఆరు నెలల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏడాది తర్వాత జరిగే ప్రసవాలకు మాత్రమే సాయం అందిస్తారు. మహిళా కార్మికులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఇక కార్మికులు సహజ మరణం పొందితే కుటుంబానికి రూ.60 వేల ఆర్ధిక సహాయం అందిస్తారు. ఇక అంత్యక్రియల క్రితం రూ.20 వేల ఆర్ధిక సాయం చేస్తారు. వీటిని నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు. కార్మికులు మరణించిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కార్మికుడు సహజ మరణం పొందితే మృతదేహాం తరలించేందుకు కిలోమీటర్కు రూ.20 చొప్పున చెల్లిస్తారు. ఈ పథకాల కింద లబ్ది పొందేందుకు ఏపీ సేవ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక గ్రామ డిజిటల్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ సెక్రటరీ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.