
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోవా తరహాలో సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ ష్యాక్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పర్యాటకులను ఆకర్షించడం, తీర ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను పెంచడం లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్, విశాఖపట్నం బీచ్ ప్రాంతాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో ప్రాంతంలో రెండు చొప్పున మొత్తం నాలుగు షాక్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.
బీచ్ ష్యాక్స్ అంటే సముద్ర తీరంలో ఏర్పాటు చేసే తాత్కాలిక రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు. పర్యాటకులు సముద్ర అందాలను ఆస్వాదిస్తూ ఆహారం, పానీయాలు తీసుకునేలా వీటిని రూపొందిస్తారు. గోవాలో ఈ విధానం ఎంతో ప్రజాదరణ పొందింది. ఇప్పుడు అదే తరహా అనుభూతిని ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కేబినెట్ ఆమోదం ప్రకారం ఈ బీచ్ షాక్స్లో మద్యం విక్రయాలు, వినియోగానికి అనుమతి ఉండనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీటి నిర్వహణకు అవకాశం కల్పించనున్నారు. దీంతో పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు ఆదాయ వనరుల పెంపు కోసం మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో పెట్టుబడులు, పర్యాటక కార్యకలాపాలను పెంచడంతో పాటు అదనపు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గోవా తరహా బీచ్ సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో ఎంత మేరకు విజయవంతమవుతుందనేది పైలట్ ప్రాజెక్టు ఫలితాల తర్వాత స్పష్టత రానుంది.