AP ENC on Srisailam: తెలంగాణ నీటి వినియోగంపై ఏపీ లేఖ.. శ్రీశైలంలో జల విద్యుత్‌ ఉత్పత్తి ఆపించాలని డిమాండ్‌

శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పత్తి ఏపీ ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ ఇంజినీరు ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి లేఖ రాశారు.

AP ENC on Srisailam: తెలంగాణ నీటి వినియోగంపై ఏపీ లేఖ.. శ్రీశైలంలో జల విద్యుత్‌ ఉత్పత్తి ఆపించాలని డిమాండ్‌
కృష్ణానదిపై రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణం ఆపాల్సిందేనని తెలంగాణ పట్టుబడితే.. శ్రీశైలంలో నిర్ణీత నీటిమట్టం లేకపోయినా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ గగ్గోలుపెడుతోంది. ఉత్పత్తి నిలిపివేయాలంటూ కృష్ణా నదీ యాజమాన్యపు బోర్డుకు ఏపీ లేఖలు రాసింది.

Updated on: Jun 25, 2021 | 2:13 PM

AP ENC letter to KRMB Over Srisailam: శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని వాడుకుంటోందని, ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ ఇంజినీరు ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే శ్రీశైలం జలాలతో ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి చేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఒకసారి ఈ విషయాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకొచ్చినా విద్యుదుత్పత్తి కొనసాగుతూనే ఉందని ఈఎన్‌సీ గుర్తు చేశారు

రాయలసీమ ఎత్తిపోతల, RDSపై తెలంగాణ ఫిర్యాదు చేస్తే, శ్రీశైలంలో జల విద్యుత్‌పై లేఖ రాసింది ఏపీ. విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని వాడుకుంటోందని ఫిర్యాదు చేసింది. ఇది ఏపీ నీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని అభ్యంతరం చెప్పింది. ఇప్పటికే పలుమార్లు చెప్పినా వినే పరిస్థితి లేదని, వెంటనే విద్యుత్‌ ఉత్పత్తిని ఆపించాలని డిమాండ్‌ చేసింది.

కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ జల వనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ నారాయణరెడ్డి లేఖ రాశారు. శ్రీశైలంలో ప్రస్తుతం 808 అడుగుల్లోనే నీరు ఉందని, అయినా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో నీటిని వాడుకుంటోందని పేర్కొన్నారు. 834 అడుగులు ఉంటేనే విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్న నిబంధన ఉన్నా దాన్ని పాటించడం లేదని వివరించారు.

శ్రీశైలం ఎడమ గట్టు దగ్గర విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతులు లేకపోయినా చేస్తోందని తెలంగాణపై ఫిర్యాదు చేశారు. ఇది ఏపీ నీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డ్ అనుమతి లేకుండానే నీటిని విడుదల చేస్తోందని పేర్కొన్నారు. జూన్‌ 1 నుంచి ప్రారంభమైన నీటి ఏడాదిలో ఇప్పటి వరకు శ్రీశైలంలోకి 8.98 టీఎంసీలే వచ్చాయని, అందులో 3.09 టీఎంసీలను తెలంగాణ వాడుకుందని ఏపీ ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు. మొత్తం నీటి ప్రవాహా౦లో ఇది 34 శాతం తెలంగాణ వాడుకుందని పేర్కొన్నారు.

విద్యుత్‌ ఉత్పత్తి ఆపకపోతే శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పడిపోతుందని, అదే జరిగితే పోతిరెడ్డిపాడుకు నీటి సరఫరా కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జలాశయంలో 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా చెన్నైకి, మిగిలిన ప్రాజెక్ట్‌లకు నీటి సరఫరా కష్టంగా మారుతుందన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే విద్యుత్‌ ఉత్పత్తిని ఆపించాలని కృష్ణా బోర్డును ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి కోరారు. వరదల సమయంలో తప్ప శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ఉమ్మడి జలాశయాల నుంచి కృష్ణా బోర్డు అనుమతి లేకుండా నీటిని తీసుకోవడానికి వీలు లేదు. తెలంగాణ విద్యుదుత్పత్తికి ఎలాంటి అనుమతులు లేవని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Ap Enc On Srisailam

Read Also…  MPTC ZPTC Counting: ఏపీ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌పై ఇంకా సస్పెన్స్‌.. వచ్చే నెల 27న సమగ్ర విచారణ జరుపుతామన్న ధర్మాసనం

Loading...
Unable to load recommendations.
Follow Us