
ఏపీలోని ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. ఒకేసారి జీతం రూ.6 వేలు పెరిగింది. ఈ మేరకు ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్ఓ)లకు, సూపర్ వైజర్కు అదనంగా రూ.6 వేలు అందించనున్నారు. ప్రస్తుతం బీఎల్ఓలకు ఏడాది జీతం రూ.12 వేలుగా ఉంది. అదనంగా రూ.6 వేలు అందించనుండటంతో ఒకేసారి అకౌంట్లోకి రూ.18 వేలు జమ కానున్నాయి. ఇక సూపర్ వైజర్లకు శాలరీ రూ.18 వేలు ఉండగా.. అదనంగా రూ.6 వేలు కలిస్తే రూ.24 వేలు అవుతుంది. వీటిని నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని కలెక్టర్లకు వివేక్ యాదవ్ ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఏపీలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(SIR) జరుగుతోంది. ఇందులో బీఎల్ఓలు, సూపర్ వైజర్లు క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అదనపు విధులు బీఎల్ఓలు, సూపర్ వైజర్లు నిర్వర్తిస్తున్నారు. దీంతో వారి విధులకు గుర్తింపుగా రూ.6 వేలు వన్ టైమ్ బోనస్గా అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో సీఈసీ ఆదేశాలతో ఏపీ సీఈవో వివేక్ యాదవ్ బోనస్కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. బీఎల్వోలకు గతంలో ఏడాదికి రూ.6 వేల గౌరవ వేతనం ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.12 వేలకు కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. అయితే సర్ ప్రక్రియలో ఇంటింటికి తిరుగుతుండటం, డాక్యుమెంట్స్ డిజిటలైజేషన్ చేస్తున్న క్రమంలో వాళ్లు అదనంగా పని చేయాల్సి వస్తోంది. దీంతో వారికి రూ.6 వేలు అదనంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐఆర్ విధుల్లో ఉన్న బీఎల్ఓలు, సూపర్ వైజర్లకు వీటిని అందించనున్నారు.
ఏపీతో పాటు తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయం, మిజోరం, నాగాలాండ్, ఢిల్లీ, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, దాద్రా అండ్ నగర్ హవేలి అండ్ డామన్ అండ్ డయ్యూ రాష్ట్రాల్లోని బీఎల్ఓలు, సూపర్ వైజర్లకు కూడా గౌరవ వేతనం అందించాలని ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల కమిషనర్లకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 36 కోట్లకుపైగా ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టారు.సుమారు 3.94 లక్షల బూత్ స్థాయి అధికారులు పని చేశారు. ఓటర్లు, ఎన్నికల అధికారులతో పాటు రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో సర్ ప్రక్రియ చేపట్టారు.