AP Assembly: అసెంబ్లీ బీఏసీలో ఆసక్తికర చర్చ.. సీఎం నిర్ణయం చారిత్రాత్మకంః మంత్రి బుగ్గన

|

Nov 18, 2021 | 12:02 PM

నవంబర్‌ 26 వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని టీడీపీ కోరగా.. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.

AP Assembly: అసెంబ్లీ బీఏసీలో ఆసక్తికర చర్చ.. సీఎం నిర్ణయం చారిత్రాత్మకంః మంత్రి బుగ్గన
Ap Assembly Bact
Follow us on

AP Assembly 2021: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ప్రారంభమైన బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు, టీడీపీ నుంచి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు.కాగా నవంబర్‌ 26 వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని టీడీపీ కోరగా.. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.

అంతకుముందు బీఏసీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. శాసన మండలి, శాసన సభ నిర్వహణపై చెరో రకమైన నిర్ణయం వెలువడింది. ఒకరోజే సభ నడపాలని భావిస్తున్నామని స్పీకర్‌ స్పష్టం చేశారు. 15 రోజులైనా సభ నడపాలని అచ్చెన్న డిమాండ్‌ చేశారు. వెంటనే సీఎం జగన్‌ కలుగజేసుకుని ప్రతిపక్షం అడుగుతున్నందున ఈ నెల 26 వరకు అసెంబ్లీ నడుపుదామని సూచించారు. సభలో అర్ధవంతమైన చర్చ జరగాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మధ్యలో ఉన్నాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు హడావుడి ఎందుకని, లిమిటెడ్‌గా ఎమ్మెల్యేలు వెళ్తే సరిపోతుందని సూచించారు సీఎం జగన్‌. దీంతో ప్రతిపక్షం అడిగిన వెంటనే సభ ఎక్కువ రోజులు నడిపేందుకు సీఎం ఓప్పుకోవడం ఓ చరిత్ర అని వ్యాఖ్యానించారు శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి.

ఇదిలావుంటే ఏపీ శాసన మండలి బీఏసీలో గందరగోళం పరిస్థితి నెలకొంది. ఈ నెల 26 వరకు శాసన సభ ఉంటుందని అసెంబ్లీ బీఏసీ నిర్ణయం తీసుకోగా… శాసన మండలి ఒక్కరోజు మాత్రమే అని మండలి బీఏసీలో ప్రకటించారు. ఇందుకు నిరసనగా మండలి బీఏసీ నుంచి కౌన్సిల్ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వాకౌట్ చేశారు. కాగా, అసెంబ్లీ శాససభ సమావేశాల పొడిగింపుపై తమకు సమాచారం లేదంటూ.. రెండోసారి మండలి బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.