
కొంచెం ప్రోత్సాహం ఇవ్వాలనే కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులు కూడా అద్భుతాలు సృష్టిస్తారని నిరుపిస్తూనే ఉన్నారు. ఇటీవల రిలీజైన ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రిజల్ట్ లో అమ్మాయిలు సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే అనంతరపురం జిల్లాలోని బెళుగుప్ప మండల విద్యాధికారి మల్లారెడ్డి పదోతరగతి స్టూడెంట్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పదో తరగతిలో 550 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులను విమానంలో తీసుకెళ్తానని చెప్పారు. దీంతో స్టూడెంట్స్ చాలా కష్టపడి చదివారు. మంచి మార్కులు కూడా తెచ్చుకున్నారు. టెన్త్ ఫలితాల్లో బెళుగుప్ప మండలంలో ఈశ్వరి, మధుశ్రీ, అర్చన, ఇందు, లావణ్య అనే ఐదుగురు అమ్మాయిలు 550 కన్నా ఎక్కువ మార్కులు సాధించారు. దీంతో MEO మల్లారెడ్డి తాను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు.
మల్లారెడ్డి స్టూడెంట్స్ ను విమానంలో హైదరాబాద్ కు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. గురువారం స్టూడెంట్స్ ని తీసుకుని జిల్లా కలెక్టర్ వినోద్కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులను కలిశారు. అధికారుల అనుమతిని తీసుకున్న అనంతరం ఈశ్వరి, మధుశ్రీ, అర్చన, ఇందు, లావణ్యలను తీసుకుని బెళుగుప్ప నుంచి బెంగళూరు వెళ్లారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి స్టూడెంట్స్ తో కలిసి విమానంలో హైదరబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను మల్లారెడ్డి ఆ స్టూడెంట్స్ కు చూపించనున్నారు. ఇలా స్టూడెంట్స్ ప్రయాణానికి అయ్యే ఖర్చు మొత్తం తానే సొంతంగా పెట్టుకున్నట్లు మల్లారెడ్డి చెప్పారు.
అయితే గతంలో కూడా స్టూడెంట్స్ ని బాగా చదివేలా ప్రోత్సహిస్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాను చెప్పారు. ఇప్పుడు కూడా అదే విధంగా తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఒక మారు మూల గ్రామం నుంచి స్టూడెంట్స్ కు విమానంలో జాలీగా ప్రయాణించే అవకాశం కల్పించిన ఎంఈవోది దొడ్డ మనసు అంటూ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..