Jagan government: గంటల వ్యవధిలో రెండు సిఐడి కేసులకు ఆదేశించిన జగన్ సర్కారు

గంటల వ్యవధిలో రెండు సిఐడి కేసులకు ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కారు. చంద్రబాబునాయుడు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకలుపై ఏపీ ప్రభుత్వం కొన్ని..

Jagan government: గంటల వ్యవధిలో రెండు సిఐడి కేసులకు ఆదేశించిన జగన్ సర్కారు
Cm Jagan

Updated on: Jul 11, 2021 | 9:54 PM

AP Skill Development Corporation: గంటల వ్యవధిలో రెండు సిఐడి కేసులకు ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కారు. చంద్రబాబునాయుడు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకలుపై కొన్ని గంటల క్రితమే సిఐడి దర్యాప్తుకి జగన్ ప్రభుత్వ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, గత ప్రభుత్వంలోని మరో అంశంపై గంటల వ్యవధిలోనే మరో సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది. తాజాగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతి పైనా సిఐడి దర్యాప్తుకు ఆదేశాలు వెలువడ్డాయి. షెల్ కంపెనీలకి నిధులు మళ్లించారంటూ రెండు కంపెనీల పై దర్యాప్తు కోరింది జగన్ సర్కార్. 241.78 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్టు గుర్తించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

సిమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు ఈ అవకతవకలకు పాల్పడినట్టు ఏపీ సర్కారు సదరు కంపెనీలపై అభియోగాలు మోపింది. ప్రభుత్వ వాటా అయిన రూ. 370.78 కోట్ల రూపాయల నుండి ఈ మొత్తం తరలించినట్టు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇది గుర్తించి ప్రభుత్వానికి తెలిపినట్లు ఉత్తర్వులులో పేర్కొంది. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని సిఐడి అడిషనల్ డిజికి ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ ఫైబర్ నెట్ డొంక కదులుతోంది, వందల కోట్ల అవినీతి.. భారీ తప్పుడు నియామకాలు బట్టబయలు ఖాయం : గౌతం రెడ్డి

ఏపీ ఫైబర్ నెట్ తీగలాగితే డొంక మొత్తం కదలడం ఖాయమంటున్నారు ఆ సంస్థ చైర్మన్ గౌతం రెడ్డి. గత టీడీపీ పాలకుల్లోని చిన్నాపెద్ద అందరి పేర్లు బయటకొస్తాయని అంటున్నారు. వందల కోట్ల అవినీతి.. భారీ ఎత్తున తప్పుడు నియామకాలు జరిగాయని.. సీఐడీ విచారణలో ఇవన్నీ బట్టబయలు కాబోతున్నాయని గౌతం రెడ్డి చెప్పుకొచ్చారు. తెలుగుదేశంపార్టీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ అంశంలో జరిగిన అవినీతి, అక్రమాలపై టీవీ9 తో మాట్లాడిన గౌతమ్ రెడ్డి.. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో.. రూ. 700కోట్ల నుంచి రూ. 1000 కోట్లు అవినీతి జరిగిందని వెల్లడించారు. “తప్పుడు విధానాల్లో నియామకాలు జరిగాయ్.. టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు.. ఈ మొత్తం వ్యవహారాలు త్వరలోనే బయటకొస్తాయ్.. ఈ అవకతవకలపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి..” అని తెలిపారు.

“ఈ స్కామ్ లో మాజీ మంత్రి నారా లోకేష్ ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణ పై గతం నుంచీ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయ్. సెట్ టాప్ బాక్సుల వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయ్.. కాబట్టి ఈ అవకతవకలకు కారకులెవరో తేల్చేందుకు.. సీఐడీ విచారణకు ఆదేశించాం” అని ఏపీ ఫైబర్ నెట్ కొత్త చైర్మన్ గౌతం రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఫైబర్ నెట్ ఫ్రాడ్ పై కచ్చితమైన ఆధారాలను సేకరించామనీ.. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తాయంటున్నారు.

కాగా, గత ప్రభుత్వంలో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఫైబర్‌నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read also: Nandigama: కృష్ణాజిల్లా నందిగామలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, బరిసెలతో కొట్లాట.. 13 మందికి గాయాలు

Loading...
Unable to load recommendations.
Follow Us