Breaking: ‘ఇంగ్లీష్ మీడియం’పై సుప్రీం విచారణ.. ‘స్టే’కు నిరాకరణ

| Edited By:

Sep 03, 2020 | 12:00 PM

ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది

Breaking: ఇంగ్లీష్ మీడియంపై సుప్రీం విచారణ.. స్టేకు నిరాకరణ
Follow us on

AP English Medium: ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కాగా స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం  తీసుకొచ్చిన 81, 85 జీవోలను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15 న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జూన్ 4న  ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ కెఎం జోసెఫ్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ”విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29(2)(ఎఫ్) ప్రకారం సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే విద్యాబోధన అని ఉంది. హైకోర్టు ఆ వాదనను పరిగణలోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది” అని తెలిపింది.

ప్రభుత్వం తరఫున విశ్వనాథన్ మాట్లాడుతూ.. ”ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం తప్పేమీ కాదు. విద్యార్థుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధ్యమైనంత వరకు అంటే తప్పనిసరిగా అని కాదు. విద్యాహక్కు చట్టంలో మాతృభాషలోనే బోధన తప్పనిసరి అని ఎక్కడా లేదు. వాస్తవ పరిస్థితులకు అనుగుణమైన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం లేకనే ప్రజలు ప్రభుత్వ పాఠశాలకు దూరం అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ బాగా చాలా ముఖ్యమైనది. ప్రభుత్వం సర్వే నిర్వహించగా అత్యధికులు ఇంగ్లీష్ మీడియంను స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయకపోవడం సమంజసం కాదు. అందుకే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వండి” అని అన్నారు.

మరోవైపు ప్రతివాదుల తరఫున గోపాల్ శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. ”ఇక్కడ విద్యార్థులకు ఛాయిస్ లేకపోవడాన్నే మేం ప్రశ్నిస్తున్నాం. తెలుగు మీడియం స్కూళ్లన్నీ ఇంగ్లీష్‌ మీడియంగా మారుతున్నాయి. నిజానికి మాతృభాషను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహించాలి. అందుకే ఈ అంశంపై స్టే ఇవ్వడం సరికాదని” తెలిపారు. వాదోపవాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. కానీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేమని వివరించింది. అలాగే తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

Read More:

ఐరాసలో పాకిస్థాన్ పన్నాగం.,తిప్పికొట్టిన భద్రతా మండలి

తెలంగాణలో ఎదురుకాల్పులు.. ఓ మావోయిస్టు మృతి