Budget : కరోనా కష్టకాలంలో ఏపీ సర్కారుకు కత్తి మీద సాములా పద్దుల రూపకల్పన.. 9 నెలల కాలానికి ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్

|

May 18, 2021 | 2:47 PM

Andhra Pradesh Budget : జగన్ సర్కారు ఎల్లుండి అసెంబ్లీలో 2021 - 22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది..

Budget : కరోనా కష్టకాలంలో ఏపీ సర్కారుకు కత్తి మీద సాములా పద్దుల రూపకల్పన.. 9 నెలల కాలానికి ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్
Follow us on

Andhra Pradesh Budget : జగన్ సర్కారు ఎల్లుండి అసెంబ్లీలో 2021 – 22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. అయితే, కరోనా కష్టకాలంలో బడ్జెట్ రూపకల్పన ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతేడాది అనుభవాలతో ఆర్థిక శాఖ ఆదాయ, వ్యయాల అంచనాలను రూపొందిస్తోంది. కరోనా నేపథ్యంలో గతేడాది ఆదాయ అంచనాలను ఏపీ సర్కారు చేరుకోలేకపోయింది. గ‌త ఏడాది సుమారు 1.82 ల‌క్షల కోట్ల వ్య‌యం కాగా.. ఆదాయం కేవ‌లం 77,560 కోట్లు మాత్ర‌మేనని.. గతేడాది లక్ష కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ లోటు ఉందని ఆర్ధిక శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అంతేకాదు, ఈ ఆర్ధిక సంవత్సరంలోనూ ఆదాయ – వ్యయాలు గతేడాది రీతినే ఉండొచ్చని ఆర్ధిక శాఖ వర్గాలు అంటున్నాయి. బడ్టెట్ లోటును ఏ మేరకు చూపాలనే దానిపై అధికారుల తర్జన భర్జన కొనసాగుతోంది. ఇప్పటికే మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్డినెన్స్ ద్వారా ఏపీ సర్కారు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. మిగిలిన 9 నెలల కాలనికి ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

ఇదిలాఉండగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 20వ తేదీన సమావేశం కాబోతోందని ఈనెల 13వ తేదీన ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం విదితమే. అయితే, బడ్జెట్‌ సమావేశాలను ప్రభుత్వం ఎన్ని రోజులు నిర్వహిస్తుంది. కరోనా నేపథ్యంలో పద్దు ప్రవేశపెట్టడం వరకే పరిమితమవుతుందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించించి గవర్నర్‌ ఉదయం తొమ్మిది గంటలకు వర్చువల్‌గా ప్రసంగించనున్నారు.

Read also : Gangula : ఈటలకు స్ట్రాంగ్ కౌంటర్లు వేసిన మంత్రి గంగుల.. ఆరోపణలు రుజువు చేస్తే ఐదు రెట్లు పరిహారం చెల్లిస్తానని సవాల్