అన్నదాతకు అండగా ఉంటామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం నిధుల విడుదల సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వచ్చే ఏడాది జనతా బజార్లను రైతుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం ద్వారా ఖరీఫ్ పంటకు సన్నద్ధమయ్యేందుకు పెట్టుబడి కోసం ఒక్కో రైతుకు రూ.5,500 అందజేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రైతులకు మరింత అండగా ఉండేందుకు వచ్చే ఏడాది గ్రామ సచివాలయాల పక్కన వైఎస్ ఆర్ జనతా బజార్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ మోహన్రెడ్డి వెల్లడించారు. రైతులు తాము పండించిన పంటలతో పాటు పండ్లు, పూలు, కూరగాయలు, చేపలు, రొయ్యలు వంటివి అమ్ముకోవడానికి ఈ జనతా బజార్లు ఉపయోగపడతాయన్నారు. అయితే, వీటి ఏర్పాటుకు ఏడాది సమయంపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్క రైతుకు దీని వల్ల ఆర్థికంగా లాభం కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు.