ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఇతర విషయాలపై చర్చకు ఒత్తిడి చేయొద్దని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. గురువారం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలకు సభ్యులు అడ్డుపడ్డారు. నిన్న సభలో జరిగిన విషయాలపై మరోసారి అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగడంతో స్పీకర్ వారించారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ..తమ నోరు మూయిస్తున్నారని స్పీకర్ను ఉద్దేశించి అనడంతో..ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరి నోరు..ఎవరి మూయించలేరని ఆయన అన్నారు. ప్రశ్నకు సంబంధించి సంభాషణ జరగాలి తప్ప విలువైన సమయాన్ని వృథా చేయెద్దని కోరారు.
రోజూ సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టడం సంప్రదాయమని, క్వశ్చన్ అవర్ సక్రమంగా జరగకపోతే తమ నియోజకవర్గ సమస్యలు ఎలా ప్రస్తావించాలని కొంతమంది తన వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారని స్పీకర్ చెప్పారు. సభ సక్రమంగా జరిగేలా చూసే బాధ్యత రెండు పక్షాలపై ఉందన్న స్పీకర్.. సభలో ఏ అంశంపై చర్చించాలన్నా తన అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. సభలో తనకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సమానమేనని, ఎవరివైపు తాను పక్షపాతం వహించడం లేదన్నారు.