
గుంటూరు, ఆగస్ట్ 27: పిడుగురాళ్ల నుండి నడికుడి రైల్వే స్టేషన్ల మధ్యలో వరుసగా జరుగుతున్న చోరీలు ఆందోళన కల్గిస్తున్నాయి. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టిన రైళ్ళలో చోరీలు ఆగడం లేదు. రెండు నెలల క్రితం రైలు దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన రెండు నెలలకే మరోసారి వరుసగా రైళ్ళలో చోరీలకు పాల్పడ్డారు. మొన్న నాగర్ సోల్ నుండి నర్సాపూర్ వెలుతున్న ఎక్స్ ప్రెస్ లోనూ నిన్న హైదరాబాద్ నుండి నర్సాపూర్ వెలుతున్న ట్రెయిన్ లోనూ దొంగలు చోరికి పాల్పడ్డారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేస్తున్నారు. ట్రెయిన్ నిలిచిపోగానే రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కి చెయిన్ స్నాచింగ్ చేసుకొని పోలీసులు అప్రమత్తమయ్యేలోపే పారిపోతున్నారు. నిన్న నడికుడి జంక్షన్ దాటిన తర్వాత ట్యాంపరింగ్ కు పాల్పడితే రెండు నెలల క్రితం న్యూపిడుగురాళ్ళ స్టేషన్ వద్ద సిగ్నల్ ట్యాంపరింగ్ చేశారు. దీంతో ప్రధానంగా ఈ మార్గం పైనే దొంగలు దృష్టి పెట్టడంపై పోలీసులు నాలుగైదు కారణాలను గుర్తించారు.
గతంలో కేవలం వేసవి సమయంలో మాత్రమే దొంగలు రైళ్ళలో చోరికి పాల్పడేవారు. ఈ ఏడాది సమ్మర్ లో రైళ్ళలో సెక్యూరిటీని పెంచి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో దొంగలు తమ పంథాను మార్చుకున్నారు. జూన్, ఆగష్టు నెలలను టార్గెట్ పెట్టుకొని చోరీలకు పాల్పడ్డారు. ప్రత్యేక దృష్టి సారించి చోరీలను అరికట్టాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.