నలుగురు విద్యార్ధులకు ఏడుగురు టీచర్లు! టెన్త్‌ ఫలితాల్లో అందరికీ గుండు సున్నా!

రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు గురువారం (ఏప్రిల్ 30) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో రాష్ట్రంలో 2161 పాఠ‌శాలల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త‌ నమోదైంది. అయితే ఓ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం విచిత్ర సంఘటన చోటు చేసుకుంది..

నలుగురు విద్యార్ధులకు ఏడుగురు టీచర్లు! టెన్త్‌ ఫలితాల్లో అందరికీ గుండు సున్నా!
Guthi Mandal High School 10th Class Results

Updated on: May 01, 2026 | 11:33 AM

అనంతపురం, మే 1: ఓ ప్రభుత్వ బడిలో పదో తరగతిలో కేవలం నలుగురు మాత్రమే విద్యార్ధులు ఉన్నారు. ఈ నలుగురు విద్యార్ధులకు పాఠాలు చెప్పేందుకు ఏడుగురు టీచర్లను ప్రభుత్వం నియమించింది. అయితే నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మాత్రం ఈ నలుగురు విద్యార్ధుల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరూ పాస్‌ కాలేదు. దీంతో ఆ పాఠశాల టెన్త్‌ ఫలితాల్లో సున్నా ఉత్తీర్ణత నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం, గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

రాష్ట్ర గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అపకీర్తి మూటగట్టుకుంది. ఈ పాఠశాల నుంచి టెన్త్‌ పరీక్షలకు హాజరైన నలుగురు విద్యార్థులూ ఉత్తీర్ణత సాధించలేకపోవడం విశేషం. అప్పటి వరకు యూపీ పాఠశాలగా ఉన్న పాఠశాలను గతేడాది జూన్‌లో విద్యాశాఖ అధికారులు ఉన్నతీకరించారు. అంతకుముందు నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఈ పాఠశాలలో ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం మరో ముగ్గురిని కేటాయించారు. దీంతో మొత్తం ఏడుగురు టీచర్లు ఉన్నారు. కానీ ఒక్క విద్యార్ధి కూడా ఇక్కడ పాస్‌ కాకపోవడం ఈ టీచర్ల పని తీరును అద్దం పడుతుంది. నలుగురు విద్యార్థుల్లో తెలుగులో ఒకరు, సైన్స్‌లో ఒకరు, సాంఘిక శాస్త్రంలో మిగిలిన ఇద్దరు ఫెయిల్‌ అయ్యారు.

దీనిపై ఎంఈఓ రవినాయక్‌ స్పందించారు. పది పరీక్షలు రాసిన విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధిస్తారనుకున్నామని, ఫలితాలు అనుకున్నట్లు రాలేదని అన్నారు. చివరకు ఉపాధ్యాయులంతా వారి ప్రయత్నం వారు చేశారని, విద్యార్ధులదే తప్పని తేల్చారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్న పరిస్థితులు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. గతంలో తీసుకున్న మ్యాపింగ్ నిర్ణయాల వల్ల విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా స్కూల్ అసిస్టెంట్లు నియమితమవ్వడం, అలాగే ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులు వెళ్ళిపోవడం వల్ల తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిపై తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us