ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ను ఎదుర్కోనేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకుంటున్నాయి. ప్రజా వినియోగానికి ఉపయోగపడే వ్యాక్సిన్ ఆమోదం తెలిపేందుకు వేగవంతంగా అనుమతులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో నిరూపితం కాని వ్యాక్సిన్ వాడకంతో దుష్ర్పభావాలు కలిగే ఆస్కారం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం త్వరలోనే ఆమోదం తెలుపుతామని అమెరికా ఎఫ్డీఏ పేర్కొన్న మరుసటి రోజే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సూచనలు చేసింది. కరోనా వైరస్ వల్ల కలిగే ప్రమాదాల కంటే వ్యాక్సిన్ ప్రయోజనాలే ఎక్కువని అధికారులు ఒప్పించినంత కాలం ఈ అనుమతుల ప్రక్రియ సాధారణం కంటే వేగవంతంగా కొనసాగుతుందని యూఎస్ ఎఫ్డీఏ చీఫ్ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. దీన్ని విభేదిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తాజాగా ప్రపంచదేశాలకు, వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు సూచన చేశారు. వేగవంతంగా వ్యాక్సిన్ ఆమోదించడం వల్ల పలు ప్రమాదాలున్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తాజాగా జరిగిన డబ్ల్యూహెచ్ఓ వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. క్లినికల్ ట్రయల్స్ను మున్ముందు కొనసాగించడం కష్టమవుతుంది. రెండోది, తగినంత అధ్యయనం పూర్తికాని వ్యాక్సిన్ వల్ల అది పనిచేసే సామర్థ్యం తక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు సౌమ్య స్వామినాథన్. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నుంచి వచ్చిన పూర్తి డేటా ఆధారంగానే వ్యాక్సిన్కు ఆమోదం తెలపాలని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయాల్లో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చే క్రమంలో దేశాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు సూచిస్తున్నారు.