
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఉద్రిక్తతలు తగ్గకపోగా అమెరికా సైన్యం ఇరాన్లోని సైనిక స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో అమెరికా బలగాలకు మరియు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు పొంచి ఉన్న ముప్పును అరికట్టడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం.
రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, అమెరికా రక్షణ శాఖ అధికారులు ఈ దాడులను ధృవీకరించారు. రాత్రికి రాత్రే అమెరికా వాయుసేన ఇరాన్ భూభాగంలోని కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రధానంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా నావికాదళానికి, వాణిజ్య రవాణాకు ఆటంకం కలిగిస్తున్న డ్రోన్, క్షిపణి కేంద్రాలపై ఈ దాడులు జరిగాయి.
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ ఇరాన్ అనుకూల బలగాల కదలికలు పెరగడం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. అమెరికా బలగాలపై దాడులు చేసేందుకు సిద్ధమవుతున్న సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యమని తెలుస్తోంది. “మా బలగాల రక్షణ, అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛా వాణిజ్యాన్ని కాపాడటం కోసం ఈ చర్యలు అనివార్యమయ్యాయి.” అని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ దాడులు జరిగిన సమయంలో ఒకవైపు దౌత్యపరమైన చర్చలు కొనసాగుతుండటం గమనార్హం. తాజా పరిణామాలతో ఇరాన్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. ఇది ప్రాంతీయ అస్థిరతకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ మెరుపు దాడులు కేవలం హెచ్చరిక మాత్రమా లేదా పూర్తి స్థాయి యుద్ధానికి సంకేతమా అన్నది వేచి చూడాలి..!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..