తీవ్ర విషాదం.. రద్దీ బీచ్‌పై డ్రోన్ దాడి.. ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి !

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న నేపథ్యంలో, సోమవారం (ఆగస్టు 04) రష్యాలోని నల్ల సముద్ర తీర ప్రాంతం గెలెండ్‌జిక్ సమీపంలోని ఆర్ఖిపో-ఒసిపోవ్కా బీచ్‌పై జరిగిన డ్రోన్ దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రష్యా అధికారుల ప్రకారం, ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు.

తీవ్ర విషాదం.. రద్దీ బీచ్‌పై డ్రోన్ దాడి.. ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి !
Ukrainian Drone Hits Russia Beach

Updated on: Aug 04, 2026 | 7:28 AM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న నేపథ్యంలో, సోమవారం (ఆగస్టు 04) రష్యాలోని నల్ల సముద్ర తీర ప్రాంతం గెలెండ్‌జిక్ సమీపంలోని ఆర్ఖిపో-ఒసిపోవ్కా బీచ్‌పై జరిగిన డ్రోన్ దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రష్యా అధికారుల ప్రకారం, ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా భూభాగంలో పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇదొకటిగా భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో రద్దీగా ఉన్న బీచ్ సమీపంలో ఒక డ్రోన్ కూలిపోవడం, అనంతరం భారీ పేలుడు సంభవించింది. బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే డ్రోన్ అసలు లక్ష్యం బీచ్‌నేనా? లేక రష్యా వైమానిక రక్షణ వ్యవస్థ దానిని కూల్చివేసే క్రమంలో ఈ పేలుడు సంభవించిందా? అనే అంశంపై ఇప్పటివరకు స్వతంత్రంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.

ఈ ఘటనపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడికి పాల్పడిందని ఆరోపించింది. రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఈ చర్యను ఉగ్రవాదంగా అభివర్ణిస్తూ, ఇటువంటి దాడులకు పాశ్చాత్య దేశాలు కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. మరోవైపు, ఈ వార్త వెలువడే సమయానికి ఉక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. తాము ఉద్దేశపూర్వకంగా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోమని ఉక్రెయిన్ గతంలో పలుమార్లు ప్రకటించింది.

ఈ దాడికి కొద్ది గంటల ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని కొనసాగిస్తోందని, మాస్కోకు శాంతి తప్ప మరో మార్గం లేకుండా చేసే వరకు సైనిక, దౌత్యపరమైన ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఎప్పుడూ ఈ యుద్ధాన్ని కోరుకోలేదని, శాంతియుత పరిష్కారానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు, సుదూర దాడులు, అంతర్జాతీయ ఒత్తిడి ద్వారా చర్చల బల్లపైకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

ఇటీవలి నెలల్లో ఉక్రెయిన్ సుదూర డ్రోన్ దాడులను విస్తరించి, ప్రధానంగా చమురు శుద్ధి కర్మాగారాలు, లాజిస్టిక్స్ కేంద్రాలు, ఆయుధ నిల్వలు వంటి వ్యూహాత్మక లక్ష్యాలనే గురి చేస్తోందని సైనిక విశ్లేషకులు చెబుతున్నారు. గెలెండ్‌జిక్ ప్రాంతంలో కూడా వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన పలు స్థావరాలు ఉండటంతో ఈ దాడిపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ఘటనలో పౌరులే భారీగా ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ సాధారణ ప్రజలే ఎక్కువ మూల్యం చెల్లిస్తున్నారనే విషయాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us