
అమెరికాలో మరోసారి గన్ కల్చర్ భూతం జడలు విప్పి వర్శిటీ విద్యార్థుల్ని తీవ్రంగా భయపెట్టింది. వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్లో శనివారం జరిగిన కాల్పుల్లో ఒక విద్యార్థితో పాటు మరో నలుగురు గాయపడ్డారు. బాధితుల్లో ఒకరి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభం కావాల్సిన సమయంలో హింసాత్మక ఘటన జరగడం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను షాకయ్యేలా చేసింది. కాగా, యూనివర్శిటీ డార్మిటరీలో తలదాచుకున్న అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. అతడి వయసు 19 ఏళ్లు పేరు కామ్రన్ హారిస్గా గుర్తించారు. గాయపడిన విద్యార్థితో అతనికి సంబంధం ఏంటి? వీరి మధ్య గొడవ జరిగిందా? కాల్పులు జరపడానికి కారణం ఏమై ఉంటుందని ఆరా తీస్తున్నారు.
కాల్పుల ఘటన విశ్వవిద్యాలయం హాస్టల్ సమీపంలో తెల్లవారుజామున 1.30 గంటలకు జరిగింది. చెస్టర్ఫీల్డ్ కౌంటీ పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన క్యాంపస్కు చేరుకుని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వర్జీనియా వర్సిటీ అధికారులు కన్ఫామ్ చేసారు. సోమవారం నుంచి కొత్త సెమిస్టర్ క్లాసులు మొదలుకానుండటంతో, వారం రోజుల ముందే హాస్టళ్లను తెరిచారు. ఈ కీలక సమయంలో కాల్పులు జరగడంతో క్యాంపస్లోని విద్యార్థులు, సిబ్బంది తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం, గాయపడిన వారిలో ఒకరు వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ విద్యార్థి అయితే మిగిలిన నలుగురు వర్సిటీ పరిసర ప్రాంతాలకు చెందిన స్థానికులు. ప్రాథమిక విచారణలో ‘డ్రైవ్-బై షూటింగ్’ కాదని కావాలనే కొందరు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేసారు. యూనివర్సిటీ ఆవరణలో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. కాల్పుల వెనక అసలు కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసారు.
ముఖ్యంగా నల్లజాతీయులైన ఆఫ్రికన్-అమెరికన్ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో ఈ వర్శిటీకి చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. విశ్వవిద్యాలయంలో చదువుతున్న వారిలో అత్యధిక మంది అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన వారు ఉన్నారు. నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్లతో పాటు వివిధ విద్యా విభాగాల్లో కోర్సులను అందిస్తుంది. ప్రస్తుతం 5,700 మంది విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తోంది వర్శిటీ.
మిషిగన్లో శుక్రవారం జరిగిన మరో కాల్పుల ఘటనలో ఐదురుగు మరణించారు. డెట్రాయిట్లోని మిస్సాకీ కౌంటీలో ఈ ఘటన జరిగింది. చాద్ హిక్మన్ అనే 39 ఏళ్ల నిందితుడు ముందుగా కాల్పులు జరిపి ఓ బాలుడిని, మధ్యవయస్కుడిని, 40 ఏళ్ల మహిళను చంపాడు. అక్కడ్నుంచి పరారై మరో చోటకు వెళ్లి కాల్పులకు తెగబడి ఓ వ్యక్తిని కాల్చి చంపాడు. అక్కడే గన్ తనపై ఎక్కుపెట్టి కాల్పులు జరిపి మృతి చెందాడు. ఓ బాలికను లైంగికంగా వేధించినందుకు హిక్మన్కు 2024లో శిక్ష పడినట్లు తెలిసింది.