జపాన్ మాజీ ప్రధాని షింజో అబెను ఓ ఆగంతకుడు కాల్చి చంపడం ప్రపంచమొత్తాన్ని విస్మయానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. షింజోతో తనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేసిన నరేంద్ర మోదీ తన బ్లాగ్లో పలు విషయాలను షేర్ చేసుకున్నారు. మోదీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
2007లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జపాన్ పర్యటనలో షింజో అబెను తొలిసారి కలిశాను. ఆ సమయంలో మా స్నేహ బంధం అధికారిక ప్రోటోకాల్ సంకెళ్లను చెరిపేసింది.
2007, 2012ల మధ్య జపాన్ ప్రధాన మంత్రితా లేని సమయంలోనూ మా వ్యక్తిగత బంధం దృఢంగా ఉంది. షింజో అబెతో జరిగిన ప్రతీ సమావేశం మేథోపరంగా చాలా ఉత్తేజపరిచేది. ఆయన ఎల్లప్పుడు కొత్త ఆలోచనలు, పాలన, ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానంలాంటి అమూల్యమైన అభిప్రాయాలతో ఉండేవారు.
జపాన్, గుజరాత్ల మధ్య శక్తివంతమైన భాగస్వామ్యాన్ని నిర్మించడంలో షింజో మద్ధతు కీలకమైంది. అలాగే ఇండియా, జపాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో షింజో కీలక పాత్ర పోషించారు. ఆయన భారత్లో పౌర అణు ఒప్పందాన్ని కొనసాగించడంలో దృఢ నిశ్చయంతో ఉండేవారు. భారతదేశంలో హై స్పీడ్ ట్రైన్స్కు షింజో మద్దతు ప్రధానమైంది.
ఈ ఏడాది మే నెలలో నేను జపాన్ పర్యటన వెళ్లిన సందర్భంలో జపాన్-ఇండియా అసోసియేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన షింజోను కలిసే అవకాశం వచ్చింది. భారత్-జపాన్ల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయడంపై ఆయనకు వినూత్న ఆలోచనలు ఉన్నాయి. ఆ రోజు నేను అతనికి వీడ్కోలు చెప్పినప్పుడు, అదే మా చివరి సమావేశం అని నేను ఊహించలేదు.
మేమిద్దరం కలిసి క్యోటోలోని టోజీ దేవాలయాన్ని సందర్శించడం, షింకన్ సేన్లో రైలు ప్రయాణం, అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమ సందర్శక. కాశీలోని గంగా ఆరతి, టోక్యోలో టీ వేడుక.. ఇలా చెప్పుకుంటూ పోతే మా మధ్య ఎన్నో చిర్మస్మరణీయ సందర్భాలు ఉన్నాయి.