
మనం బాగున్నప్పుడు లెక్కల గురించి మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు సార్.. ఇది ఎక్కడో విన్నట్టు ఉందా..? ఇది మన తెలుగు సినిమాలోని డైలాగే.. అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి మూవీలోనిది.. అచ్చం ఈ డైలాగ్ కు తగినట్లుగానే మాల్దీవుల పరిస్థితి మారింది.. ఒకప్పుడు భారత్ గురించి పలు వ్యాఖ్యలు చేసి సవాల్ చేసిన మాల్దీవులు.. ఇప్పుడు కాళ్లబేరానికి వచ్చింది. భారత్తో కయ్యానికి కాలు దువ్వుకుని.. అయ్యో.. ఉన్నది పోయింది.. ఉంచుకున్నది పోయింది.. అనే పరిస్థితుల్లో ప్లీజ్ బాబూ మా దేశంలో పర్యటించండి.. అని భారతీయులను అడుక్కునే పరిస్థితికి దిగజారింది. కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో పర్యటించడంపై మాల్దీవుల మంత్రి, పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య వివాదంగా మారాయి. ఈ నేపథ్యంలోనే భారత్ సెలబ్రీటిలు, పలువురు నేతలు బాయ్కాట్ మాల్దీవులు అంటూ.. లక్షద్వీప్ లో పర్యటించాలని కోరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు రెండు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బతినేలా చేశాయి. ఈ క్రమంలోనే చైనా అనుకూలుడైన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపాలని నిర్ణయించటంతో సంబంధాలు మరింత క్షీణించాయి.
అయితే, భారత్ తో కయ్యానికి కాలు దువ్విన తర్వాత.. మాల్దీవుల పరిస్థితి ఆర్థికంగా మరింత దిగజారింది. ఒకప్పుడు పర్యాటకంలో అగ్రభాగాన ఉన్న మాల్దీవులు.. ఇప్పుడు పర్యాటకులు సందర్శించకపోవడంతో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతోంది. ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో.. పర్యటించండి ప్లీజ్ అంటూ భారతీయులను వేడుకుంటోంది. పర్యటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలంటూ ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ భారత్ కు విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య బంధం చారిత్రకమైనదంటూ ఫైసల్ గుర్తుచేశారు.
VIDEO | Here’s what Tourism Minister of Maldives Ibrahim Faisal said on India-Maldives relations.
“We have a history. Our newly elected government also wants to work together (with India). We always promote peace and a friendly environment. Our people and the government will… pic.twitter.com/xFgEkgEunv
— Press Trust of India (@PTI_News) May 6, 2024
భారత్ – మాల్దీవులకు ఒక చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన మాల్దీవుల ప్రభుత్వం భారత్తో కలిసి పనిచేయాలనుకుంటోంది. తాము ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తామని.. తమ ప్రజలతో పాటు ప్రభుత్వం భారతీయులకు ఘన స్వాగతం పలుకుతుందని ఇబ్రహీం ఫైసల్ పేర్కొన్నారు. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యటక మంత్రిగా భారతీయులను కోరుతున్నాను.. అంటూ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైసల్ వివరించారు.
ముఖ్యంగా.. మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యల నాటినుంచి .. వేలాది మంది భారతీయులు మాల్దీవుల్లో పర్యటనను రద్దు చేసుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీలు సైతం ఆ దేశానికి తాత్కాలికంగా బుకింగ్లను నిలిపివేశాయి. దీంతో అప్పటి వరకు మాల్దీవులను సందర్శిస్తున్న పర్యటకుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది. 2024 తొలి నాలుగు నెలల్లో భారత పర్యటకుల సంఖ్య దాదాపు 50 శాతం పడిపోయిందని నివేదిక తెలిపింది.. పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లగా.. ఏడాది కిత్రం జనవరి – ఏప్రిల్ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది. ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ , మాల్దీవులు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..