Japan Earthquake: జపాన్‌‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

జపాన్‌లోని దక్షిణ క్యుషు ద్వీపంలోని కుమామోటో ప్రిఫెక్చర్‌ను 7.1 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం వణికించింది. భూకంపం అనంతరం తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భూకంప కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.

Japan Earthquake: జపాన్‌‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Japan Earthquake

Updated on: Jul 28, 2026 | 2:56 PM

జపాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 7.1గా నమోదయ్యింది. జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషులోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కేంద్రం సముద్ర ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది. భూకంపం కారణంగా గాయాలైనట్లు, ఆ ప్రాంతంలో ఒక భవనం కూలిపోయినట్లు జపాన్ ప్రధాని సనాయ్ తకైచి తెలిపారు. భారీ భూకంపంతో దక్షిణ జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఊకీ , మకిజానో ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భూకంప కేంద్రాన్ని నాగసాకికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భూమి కొన్ని సెకన్ల పాటు తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లి ఆశ్రయం పొందారు.

భూకంపం తరువాత జపాన్ వాతావరణ శాఖ తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. సముద్రంలో ఉన్న మత్స్యకారులు, నౌకలు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. భూకంపం వల్ల ఆస్తి నష్టంతోపాటు, ప్రాణనష్టం కూడా జరగవచ్చని పేర్కొంటున్నారు. అయితే, దీనిపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు.

జపాన్ ప్రధానమంత్రి కార్యాలయం, నష్టం పరిస్థితిని వీలైనంత త్వరగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించింది. అత్యవసర విపత్తు ప్రతిస్పందనలో మానవ ప్రాణాలకు అన్నింటికన్నా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి ప్రయత్నాన్ని విడిచిపెట్టవద్దని ప్రభుత్వం కూడా అధికారులను కోరింది. మంగళవారం నైరుతి జపాన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత అణు విద్యుత్ కేంద్రాలలో ఎలాంటి అసాధారణతలు లేదా రేడియోధార్మికత లీకేజీలు తక్షణమే నమోదు కాలేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.

వీడియో చూడండి..

జపాన్ దక్షిణ క్యుషు ద్వీపంలోని కుమామోటో, నాగసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఓయిటా, మియాజాకి ప్రాంతాలకు జపాన్ ప్రభుత్వం అత్యవసర భూకంప హెచ్చరికలను జారీ చేసింది.

వారంలో రెండవ భూకంపం

జూన్ 25న ఉత్తర జపాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం లేదా పెద్ద నష్టం జరగలేదు.

జపాన్ ప్రపంచంలోనే అత్యంత భూకంపాలు సంభవించే దేశాలలో ఒకటి, ఇది పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” యొక్క పశ్చిమ అంచు వెంబడి ఉన్న నాలుగు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లపై ఉంది.

సుమారు 125 మిలియన్ల ప్రజలకు నిలయమైన ఈ ద్వీపసమూహంలో, సాధారణంగా ప్రతి సంవత్సరం వందలాది భూకంపాలు సంభవిస్తాయి. ప్రపంచంలోని భూకంపాలలో దాదాపు 18 శాతం ఇక్కడే సంభవిస్తాయి.

వాటిలో అత్యధికం తేలికపాటివే, అయినప్పటికీ అవి కలిగించే నష్టం అవి సంభవించే ప్రదేశాన్ని బట్టి, భూమి ఉపరితలం క్రింద అవి తాకే లోతును బట్టి మారుతూ ఉంటుంది.

2011లో సంభవించిన 9.0 తీవ్రత గల భారీ సముద్రగర్భ భూకంపం తాలూకు జ్ఞాపకాలు దీనిని వెంటాడుతున్నాయి. ఆ భూకంపం అనంతరం వచ్చిన సునామీలో సుమారు 18,500 మంది మరణించారు లేదా గల్లంతయ్యారు.. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం ధ్వంసమైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us