BRICS Summit 2024: మరోసారి ఉక్రెయిన్ యుద్ద ప్రస్తావన తీసుకొచ్చిన మోదీ.. పుతిన్ ఎమన్నారంటే..?

| Edited By: Ram Naramaneni

Oct 22, 2024 | 10:24 PM

ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ చేరుకున్న ప్రధాని మోదీ శాంతి సందేశం ఇచ్చారు.

BRICS Summit 2024: మరోసారి ఉక్రెయిన్ యుద్ద ప్రస్తావన తీసుకొచ్చిన మోదీ.. పుతిన్ ఎమన్నారంటే..?
Pm Modi , Vladimir Putin
Follow us on

రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలోని కజాన్ నగరంలో పర్యటిస్తున్నారు. కజాన్ చేరుకున్న ప్రధాని మోదీకి అఖండ స్వాగతం లభించింది. అక్టోబర్ 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు కజాన్‌లో బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్నారు. సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

మంగళవారం(అక్టోబర్ 22) ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ చేరుకున్న ప్రధాని మోదీ శాంతి సందేశం ఇచ్చారు. పుతిన్‌తో సంభాషణలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్‌కు అధ్యక్ష పదవిని విజయవంతం చేసినందుకు రష్యాను అభినందించారు మోదీ. అంతేకాదు చాలా దేశాలు ఈ గ్రూప్‌లో చేరాలనుకుంటున్నాయని తెలిపారు.

బ్రిక్స్ సదస్సు కోసం కజాన్ లాంటి అందమైన నగరానికి వచ్చే అవకాశం రావడం సంతోషకరమైన విషయమని ప్రధాని మోదీ అన్నారు. ఈ నగరంతో భారతదేశానికి లోతైన, చారిత్రక సంబంధాలున్నాయని గుర్తు చేశారు. కజాన్‌లో భారత కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించడంతో ఈ సంబంధాలు మరింత బలపడతాయన్నారు. జూలైలో జరిగిన వార్షిక శిఖరాగ్ర సమావేశం ప్రతి రంగంలో సహకారాన్ని బలోపేతం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. మూడు నెలల్లో రెండవ రష్యా పర్యటన భారత్ – రష్యా మధ్య సన్నిహిత సమన్వయం, బలమైన స్నేహాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తన సంభాషణ సందర్భంగా, రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ అంశాన్ని ప్రస్తావించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని విశ్వసిస్తున్నామన్నారు. శాంతి, స్థిరత్వానికి ముందస్తుగా తిరిగి రావడానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని, అన్ని ప్రయత్నాలలో మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని మోదీ వెల్లడించారు. రాబోయే కాలంలో అన్ని విధాలా సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.

ప్రధాని మోదీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, జూలైలో మోదీతో జరిగిన భేటీ చాలా మంచి చర్చలు జరిగినట్లు గుర్తు చేసుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయన్నారు. ఇద్దరం చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నాం. కజాన్‌ను సందర్శించడానికి ఆహ్వానాన్ని అంగీకరించినందుకు మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పుతిన్. బ్రిక్స్ సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొని, చాలా ముఖ్యమైన చర్చలు జరుపుతామని అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. భారతదేశం – రష్యాల మధ్య సహకారానికి చాలా ప్రాముఖ్యతనిస్తామని పుతిన్ తెలిపారు. భారతదేశం – రష్యా మధ్య సంబంధాలు చారిత్రాత్మకమైనవని పుతిన్ పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్‌ల భేటీ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ.. మా సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని, మా మాటలను అర్థం చేసుకోవడానికి మీకు అనువాదం కూడా అవసరం లేదని అన్నారు. దీనిపై ప్రధాని మోదీ బహిరంగంగా నవ్వుతూ కనిపించారు.

మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా రష్యా చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా సభ్య దేశాల నేతలను ఆయన కలుసుకోవచ్చు. శిఖరాగ్ర సమావేశంలో బ్రిక్స్ సహకారం కోసం చైనా విజన్ గురించి జిన్‌పింగ్ మాట్లాడనున్నారు. గ్లోబల్ సౌత్ కోసం సంఘీభావం గురించి కూడా జెన్‌పింగ్ కీలక ప్రకటన చేసే అవకాశముంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..