భారత్–న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి BAPS వారధి.. మోదీ పర్యటనతో మరింత బలపడిన ద్వైపాక్షిక సంబంధాలు

India-New Zealand Strategic Partnership: భారత్–న్యూజిలాండ్ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన చారిత్రాత్మకంగా నిలిచింది. BAPS స్వామినారాయణ సంస్థ, అక్షర్‌ధామ్ ఆలయం, భారతీయ ప్రవాసుల సేవా కార్యక్రమాలు రెండు దేశాల మధ్య విశ్వాసం, సంస్కృతి, ప్రజల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసిన విధానాన్ని తెలుసుకోండి.

భారత్–న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి BAPS వారధి.. మోదీ పర్యటనతో మరింత బలపడిన ద్వైపాక్షిక సంబంధాలు
BAPS Strengthens India–New Zealand Strategic Partnership

Updated on: Jul 13, 2026 | 5:19 PM

ఆక్లాండ్: భారత్–న్యూజిలాండ్ సంబంధాలు మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక న్యూజిలాండ్ పర్యటనను విజయవంతంగా ముగించగా, ఈ సందర్భంగా ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను అధికారికంగా “వ్యూహాత్మక భాగస్వామ్యం (Strategic Partnership)” స్థాయికి తీసుకెళ్లాయి. అలాగే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు రూ. 35,000 కోట్లు (7 బిలియన్ న్యూజిలాండ్ డాలర్లు)కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. అయితే ఈ దౌత్య విజయానికి కేవలం రాజకీయ చర్చలే కారణం కాదు. విశ్వాసం, సంస్కృతి, ప్రజల మధ్య బంధం, ముఖ్యంగా BAPS స్వామినారాయణ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, రెండు దేశాల మధ్య ఏర్పడిన స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేశాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

సేవా భావంతో ప్రారంభమైన అనుబంధం

2023 సెప్టెంబర్‌లో ఆక్లాండ్‌లోని BAPS స్వామినారాయణ మందిరంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుతం న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ సమాజం చేస్తున్న నిస్వార్థ సేవలను ఆయన ప్రశంసించారు. “న్యూజిలాండ్ ప్రజలకు మీరు అందిస్తున్న నిస్వార్థ సేవ, సమాజానికి చేస్తున్న సహకారం అభినందనీయం” అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సేవ’ (Seva) అనే భారతీయ విలువను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

భారతీయ సమాజంపై ప్రశంసలు

ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా లక్సన్ భారతీయ సమాజంతో అనుబంధాన్ని కొనసాగించారు. 2025 అక్టోబర్‌లో వెల్లింగ్టన్‌లోని BAPS స్వామినారాయణ మందిరంలో నిర్వహించిన దీపావళి, హిందూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. “భారతీయ సమాజం లేకపోతే న్యూజిలాండ్ నేటి స్థాయికి చేరుకునేది కాదు. మీ సంస్కృతి, విలువలను యువతకు అందించడం దేశ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతోంది” అని కొనియాడారు.

అక్షర్‌ధామ్ సందర్శనతో మరింత బలమైన బంధం

2025 మార్చిలో క్రిస్టోఫర్ లక్సన్ 110 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన న్యూఢిల్లీలోని స్వామినారాయణ అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. “హిందూ సమాజం న్యూజిలాండ్‌కు సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అపారమైన సేవలు అందించింది. మీరు మా దేశాన్ని మరింత గొప్పదిగా, సంపన్నంగా తీర్చిదిద్దారు” అని ప్రశంసించారు.

మోదీ పర్యటనతో కొత్త అధ్యాయం

40 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆక్లాండ్‌లో భారతీయ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. “కియా ఓరా మోదీ” (Kia Ora Modi) పేరుతో నిర్వహించిన భారీ సభకు 10 వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కూడా పాల్గొని మోదీతో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారతీయ తత్వాన్ని, స్థానిక మావోరీ సంస్కృతిని అనుసంధానిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“ఈ సభ భారతీయ ప్రవాసుల సమావేశం మాత్రమే కాదు. భారత్–న్యూజిలాండ్ స్నేహానికి ప్రతీక. మావోరీ భాషలో ‘వాకా’ (Waka) అనేది కేవలం ఓ పడవ కాదు. అది ఒక ఉమ్మడి ప్రయాణానికి ప్రతీక. ఇప్పుడు భారత్–న్యూజిలాండ్ వాకా కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

BAPS స్పందన

ఈ పరిణామాలపై BAPS స్వామినారాయణ అక్షర్‌ధామ్, న్యూఢిల్లీ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. “భారత్–న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్య చరిత్రలో అక్షర్‌ధామ్ భాగస్వామ్యం కావడం గర్వకారణం. ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అక్షర్‌ధామ్ సందర్శన నుంచి, న్యూజిలాండ్‌లో BAPS కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం, తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆక్లాండ్‌లో లభించిన ఆత్మీయ స్వాగతం వరకు జరిగిన ప్రతి ఘట్టం విశ్వాసం, సంస్కృతి, ప్రజల మధ్య బంధానికి నిదర్శనం. భవిష్యత్ తరాల కోసం భారత్–న్యూజిలాండ్ స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు BAPS, స్వామినారాయణ అక్షర్‌ధామ్ కట్టుబడి ఉన్నాయి” అని పేర్కొంది.

భవిష్యత్తు భాగస్వామ్యానికి బలమైన పునాది

రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో భారత్–న్యూజిలాండ్ సహకారం మరింత విస్తరించనున్న నేపథ్యంలో, గత కొన్ని సంవత్సరాలుగా విశ్వాసం, సేవా భావం, సాంస్కృతిక అనుబంధం ద్వారా ఏర్పడిన ప్రజల మధ్య బంధమే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిజమైన బలమైన పునాదిగా నిలుస్తోందని దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Follow Us