ముగింపు దిశగా అమెరికా షట్డౌన్.. ఊపిరి పీల్చుకున్న అమెరికన్లు
అమెరికాలో 40 రోజుల సుదీర్ఘ ప్రభుత్వ షట్డౌన్ ముగింపు దశకు చేరింది. సెనేట్ కీలక బిల్లును ఆమోదించడంతో ఫెడరల్ కార్యకలాపాలు, నిధులు పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. ప్రభావిత ఫెడరల్ ఉద్యోగులకు బకాయిపడ్డ జీతాలను చెల్లించేందుకు బిల్లు హామీ ఇస్తుంది. విమాన ప్రయాణాలతో సహా పలు ప్రభుత్వ సేవలకు అంతరాయం కలిగించిన షట్డౌన్తో ప్రజలకు త్వరలో ఊరట లభించనుంది.
అమెరికాలో షట్డౌన్కు ముగింపుదిశగా అడుగులువేస్తోంది. అగ్రరాజ్యం చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా, 40 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్డౌన్కు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది. అధికార, విపక్షాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని ఇప్పుడు తుది ఆమోదం కోసం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు పంపనున్నారు. డెమొక్రాటిక్ సెనేటర్లు జీన్ షాహీన్, మ్యాగీ హసన్.. రిపబ్లికన్ లీడర్ జాన్ థూన్, వైట్హౌస్ ప్రతినిధులతో కలిసి వారాంతంలో జరిపిన చర్చలు ఫలించాయి. ఈ బిల్లు ప్రకారం చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జనవరి వరకు నిధులు అందుతాయి. షట్డౌన్ కారణంగా ప్రభావితమైన ఫెడరల్ ఉద్యోగులందరికీ బకాయిపడ్డ జీతాలను చెల్లించేందుకు హామీ ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సెనేట్లోని డెమొక్రాటిక్ పార్టీ నేత చక్ షుమర్ ఈ బిల్లును వ్యతిరేకించారు. ఆరోగ్య సంరక్షణ చట్టం కింద సబ్సిడీల వంటి సమస్యలను పరిష్కరించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ 8 మంది డెమొక్రాటిక్ సెనేటర్లు పార్టీ వైఖరిని పక్కనపెట్టి బిల్లుకు మద్దతు పలకడంతో 60 ఓట్ల మెజారిటీతో ఇది ఆమోదం పొందింది. ఈ చట్టం ద్వారా షట్డౌన్ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. అలాగే 2026 ఆర్థిక సంవత్సరం వరకు ఫుడ్ స్టాంప్ కార్యక్రమానికి నిధుల కొరత లేకుండా చూస్తారు. ఇది ప్రభుత్వ సహాయంపై ఆధారపడిన తక్కువ ఆదాయ కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. షట్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాలతో సహా అనేక ఫెడరల్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆదివారం వేలాది విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సిబ్బంది కొరత కారణంగా విమాన సర్వీసులను 4 శాతం తగ్గించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. థ్యాంక్స్గివింగ్ సెలవుల ముందు ప్రయాణికుల్లో ఇది ఆందోళన రేకెత్తించింది. ఈ బిల్లుకు హౌస్ కూడా వేగంగా ఆమోదం తెలుపుతుందని, తద్వారా వారాల తరబడి నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని, ఉద్యోగులకు, ప్రజలకు ఊరట లభిస్తుందని ఇరుపక్షాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుస తుఫాన్లతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం
స్పైస్జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
50 మంది విద్యార్థులను కాపాడి ప్రాణాలు వదిలిన బస్ డ్రైవర్..
అందెశ్రీ అందుకే చనిపోయారా ?? గాంధీ వైద్యులు సంచలన ప్రకటన
Kadapa: అమీన్పీర్ దర్గాను సందర్శించిన కమెడియన్ అలీ, హీరో సుమన్
