ఆందోళనకారులు దేశభక్తులు..ఇరాన్‌ అల్లర్లకు ట్రంప్‌ ఆజ్యం
Iran Allarlu

ఆందోళనకారులు దేశభక్తులు..ఇరాన్‌ అల్లర్లకు ట్రంప్‌ ఆజ్యం

Updated on: Jan 15, 2026 | 12:33 PM

ఇరాన్‌... అల్లర్లతో అట్టుడుకుతోంది. వేలమంది నిరసనకారులు చనిపోయారనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి. మండే ఇరాన్‌పై ట్రంప్‌ మరింత ఆజ్యం పోశారు. ఆందోళనలు కొనసాగించాలని నిరసనకారులకు పిలుపునిచ్చారాయన. ఇరాన్‌లో అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. వందల్లో కాదు.. పదివేల మందికిపై ఆందోళనకారులు చనిపోయారని.. వేల మందిని నిర్బంధించారనే చర్చ జరుగుతోంది. ఇరాన్‌లో ఆందోళనల తీవ్రత అందుకు అద్దంపడుతోంది.

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై కన్నెర్ర చేసిన ఖమేనీ..కన్పిస్తే కాల్చేయమని షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్డ్స్‌ ఇచ్చిన క్రమంలో జనంపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక చర్యతో అనేక ప్రాంతాలు శవాల దిబ్బగా మారాయని ఇంటర్నేషనల్‌ మీడియా కోడైకూస్తోంది. ఇరాన్‌లో పెరుగుతోన్న హింసపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు భగ్గుమంటుంటే మరోవైపు తమకు మద్దతుగా లక్షల మందితో ర్యాలీ తీయించింది ఖమేనీ సర్కార్‌.
ఇక ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25శాతం సుంకాలు పెంచుతామని హుంకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌..మరో బాంబు పేల్చారు. ఖమేని వ్యతిరేక వర్గాలను, ఆందోళనకారులను ఇరాన్‌ దేశభక్తులుగా సంబోధిస్తూ నిరసనలు కొనసాగించమని తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ట్రూత్‌లో ట్వీట్‌ చేశారు. నిరసనకారులపై దాడులు, నిర్బంధాలు ఆపనంతవరకు ఇరాన్‌తో ఎలాంటి చర్చలు ఉండవన్నారు. ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని, నిరసనకారులకు అన్నిరకాలుగా సాయం అందిస్తామన్నారు ట్రంప్‌. ఆందోళనలతో రగిలిపోతున్న ఇరాన్‌ అల్లర్లకు ట్రంప్‌ మరింత ఆజ్యం పోయడం చర్చనీయాంశంగా మారింది.

 

Published on: Jan 15, 2026 12:31 PM