తెల్లవారుజామున ఆ విద్యార్ధి ఇంటి తలుపు తట్టిన కలెక్టర్..ఏం చేశారంటే..! వీడియో
వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆ జిల్లా పాలనాధికారి. విద్యా విషయాల్లో ఆయన చొరవే వేరు. ఇప్పటికే ఆ అధికారి చాక్ పీస్ పట్టి పాఠాలు బోధించారు. గరిటె చేత పట్టి విద్యార్థులకు భోజనం వడ్డించారు. విద్యార్థులతో హాస్టల్లో రాత్రి బస చేస్తున్నాడు. తాజాగా తెల్లవారుజామున ఓ విద్యార్థి ఇంటి తలుపు తట్టిన ఆ అధికారి ఏం చేశారో.. చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు వచ్చిన కొద్ది రోజుల్లోనే పనితీరులో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో హల్చల్ చేస్తున్నారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి విద్యాశాఖపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా తరచూ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తూ ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ప్రతిభను తెలుసుకుంటున్నారు.
తరగతి గదిలో చాక్ పీస్ పట్టి విద్యార్థులకు పాఠాలను కూడా బోధిస్తున్నారు. ముఖ్యంగా హాస్టల్లో ఉండే విద్యార్థులకు అందుతున్న ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వ హాస్టళ్ళను ఆకస్మిక తనిఖీ చేస్తూ ఆహార మెనూ పరిశీలిస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించని ఉపాధ్యాయులు, సిబ్బందిపై సస్పెన్షన్ల వేటు కూడా వేశారు. తనతో పాటు జిల్లా అధికారులు.. ప్రభుత్వ హాస్టల్లో నిద్రించేందుకు హాస్టల్ నిద్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం హాస్టల్ నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రాత్రి సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ లో ఆయన నిద్రించారు.