Tirupati: నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో శ్రీ వేంకటేశ్వర జ్యువెలర్స్ షాపులో పట్టపగలు జరిగిన బంగారు చోరీ కలకలం రేపింది. దొంగ కస్టమర్గా వచ్చి, యజమాని కళ్లలో కారం కొట్టి లక్షల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయ్యింది. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి దోపిడీలు వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బంగారం ధర ఆకాశాన్నంటుతున్న వేళ దోపిడీలు కూడా ఎక్కువయ్యాయి. దొంగలకు భయపడి జనం నగలు వేసుకొని బయటకు వెళ్లడం మానేశారు. దీంతో ఏకంగా దుకాణాల్లోనే చోరీలకు తెగబడుతున్నారు దొంగలు… అదికూడా పట్టపగలు.. నగలు కొనడానికి వచ్చినట్టు వచ్చి వ్యాపారులనున మాటల్లో పెట్టి బంగారం కొట్టేస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా సూళ్ళూరు పేటలో ఇలాంటి ఘటనే జరిగింది. నగల వ్యాపారి కళ్లలో కారం కొట్టి బంగారం ఎత్తుకెళ్లిపోయాడు దుండగుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక శ్రీ వేంకటేశ్వర జ్యువెలర్స్ షాపునకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ వ్యక్తి స్కూటర్ పై వచ్చాడు. లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి.. మంచి డిజైన్లు చూపించాలని, 916 హాల్మార్క్ నగలే కావాలని యజమాని వెంకటేశ్వర్లును అడిగాడు. “బంగారం ధరలు తగ్గుతాయా? ఇప్పుడు కొంటే లాభమేనా?” అంటూ ముచ్చట్లు పెట్టి యజమానిని మాటల్లో దించాడు. యజమాని కూడా అతను నిజమైన కస్టమర్ అని నమ్మి రకరకాల ఆభరణాలు చూపిస్తుండగా.. ఒక్కసారిగా ఆ దుండగుడు తన బ్యాగులో తెచ్చుకున్న కారం పొడిని యజమాని కళ్లలో కొట్టాడు. కళ్లమంటతో యజమాని విలవిలలాడుతుండగానే, టేబుల్పై ఉన్న బంగారు ఆభరణాలను చేజిక్కించుకుని దుండగుడు క్షణాల్లో స్కూటర్పై పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ షాపులోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. లక్షల విలువైన బంగారం చోరీకి గురైనట్లు యజమాని వాపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పట్టపగలే ఇంతటి సాహసానికి దొంగలు ఒడిగట్టడంతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!
పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ..
Hyderabad: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై.. సమాజం ఎటుపోతుందో
