ఇదేం దొంగతనం సామీ.. బంగారంతో పాటు ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..!
ఖమ్మం జిల్లా పెనుబల్లిలో దొంగలు ఇంట్లో చోరీ చేసి బంగారం, నగదుతో పాటు వంట నూనె, బియ్యం, సరుకులు, ఊరగాయ పచ్చడిని కూడా దోచుకెళ్లారు. తమ పాత చెప్పులు వదిలి ఇంట్లో ఉన్న కొత్త చెప్పులు వేసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సాధారణంగా దొంగలు ఇళ్లలో చోరీకి వెళ్తే.. బంగారం, వెండి, లేదంటే విలువైన వస్తువుల ఏమైనా ఉంటే ఎత్తుకెళ్లిపోతుంటారు. కానీ ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ చోరీని చూస్తే.. ఇదేం విడ్డూరం అని ముక్కున వేలేసుకుంటారు. విలువైన వస్తువులతో పాటు వంట నూనె, బియ్యం, ఆఖరికి ఊరగాయ పచ్చడిని కూడా వదలకుండా ఊడ్చేసారు దొంగలు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురంలో ఈ వింత చోరీ వెలుగుచూసింది. అర్ధరాత్రి వేళ ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు గడ్డపారతో బీరువా పగలగొట్టారు. అందులో ఉన్న సుమారు 5 కాసుల బంగారం, రూ. 60 వేల నగదును దోచేశారు. అంతటితో ఆగకుండా కిచెన్లోకి వెళ్లి.. వంట నూనె, బియ్యం, సరుకులు కూడా మూటగట్టారు. వెళ్తూ వెళ్తూ.. ఇంట్లో ఉన్న ఊరగాయ పచ్చడి జాడీని చంకనెత్తుకెళ్లడమే కాకుండా, తాము వేసుకువచ్చిన పాత చెప్పులను అక్కడే వదిలేసి, ఇంట్లో ఉన్న ‘కొత్త చెప్పులు’ వేసుకుని చెక్కేశారు.సర్వస్వం కోల్పోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. పెనుబల్లి మండలంలో గత కొద్దిరోజులుగా ఈ గడ్డపారల దొంగల ముఠా అర్ధరాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతూ స్థానికులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల ఈ ముఠాకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ, మిగిలిన నిందితులు మళ్లీ ఇలా రెచ్చిపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామాల్లో కొత్తవారు లేదా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ అంటే ఈమెదే..! వాకింగ్తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట.. భయంతో పరుగులు తీసిన ఇంటి యజమాని
కేజీఎఫ్ కాదు బాస్.. అంతకు మించి.. మేడిన్ ఆంధ్ర గోల్డ్ వచ్చేసింది!
వందే భారత్ ఏసీ కోచ్ చూసారా? లగ్జరీ ఇంటీరియర్స్తో లుక్ అదిరిందిగా!
