జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన కల్తీ వంట నూనె తయారీ వ్యవహారం కాకినాడ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ కల్తీ నూనె తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్ కలిపి వంట నూనెగా తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి ధర్మవరం నేషనల్ హైవే సమీపంలోని ఓ రేకుల షెడ్డుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ కల్తీ నూనె తయారీకి సంబంధించిన పరికరాలు, ముడి సరుకులు గుర్తించారు. విచారణలో పిఠాపురం మండలం ఎఫ్.కే. పాలెంకు చెందిన బండారు ఫణి ప్రసాద్ అనే వ్యక్తి ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ప్రతాప్ సింగ్కు చెందిన షెడ్డును అద్దెకు తీసుకుని జంతువుల కొవ్వు, తక్కువ ధరకు లభించే క్రూడ్ ఆయిల్ను మరిగించి వంట నూనెలా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్ధలం నుంచి 840 కిలోల కల్తీ నూనె , 60 కిలోల క్రూడ్ ఆయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నూనెను ఇచ్ఛాపురం, రాజమండ్రి ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులకు విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రజారోగ్యానికి హాని కలిగించే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం :