అలాంటి మెసేజ్లతో జర భద్రం..! హైదరాబాద్ జలమండలి అలర్ట్
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పందాలో మోసాలు చేస్తున్నారు. ఈసారి వారు హైదరాబాద్ జలమండలి వినియోగదారులను టార్గెట్ చేస్తూ నల్ల బిల్లుల చెల్లింపుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. మీరు నల్ల బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ను తొలగిస్తాము అనే భయపెట్టే మెసేజ్లు వినియోగదారులకు పంపుతున్నారు. ఈ సందేశాలను నమ్మిన వారికి ఏపీకే ఫైల్ను పంపిస్తూ వారి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. ఈ విషయంపై జలమండలి అధికారులు స్పందిస్తూ ఈ సందేశాలు తమవి కాదని పూర్తిగా నకిలీవి అని స్పష్టం చేశారు.
ప్రజలు అలాంటి సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. వినియోగదారులు తమ బిల్లుల సమాచారం కోసం జలమండలి అధికారిక వెబ్సైట్ను లేదా కస్టమర్ కేర్ నెంబర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. నేరగాళ్లు ప్రజలకు నల్ల బిల్లుల పేరుట సందేశాలను పంపుతున్నారు. ఈ సందేశంలో ఉన్న లింకును నొక్కితే ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేయమని సూచిస్తున్నారు. ఒకసారి ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే అది మీ ఫోన్ లోని సమాచారాన్ని చోరీ చేస్తుంది. బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ పిన్లు వంటి వ్యక్తిగత డేటా మోసగాళ్ల చేతిలో పడుతుంది. అందుకే అప్రమత్తంగా ఉండండి. అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బిల్లుల చెల్లింపులు చేయండి. అనుమానస్పద సందేశాలు లేదా లింకులు క్లిక్ చేయకుండా ఉంటే మంచిదే. ఫోన్లో అనుమానస్పద ఫైల్ను డౌన్లోడ్ చేయవద్దు. నకిలీ సందేశాలు వచ్చినప్పుడు వాటిని జలమండలి కస్టమర్ కేర్ కు తెలియజేయండి.
మరిన్ని వీడియోల కోసం :