కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బతో మరణించిన తల్లి అమృతమ్మ మృతదేహాన్ని చూసి కుమార్తె పద్మ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తల్లిని పట్టుకుని రోదిస్తుండగానే ఆమెకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఒకేరోజు తల్లీకూతుళ్లు మృతిచెందడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది.
జన్మనిచ్చిన కన్నతల్లి మరణాన్ని ఆ కూతురు తట్టుకోలేకపోయింది. ‘అమ్మా.. నిన్ను వదిలి నేనుండలేను’ అన్నట్లుగా, తల్లి భౌతికకాయంపై పడి ఏడుస్తూ అక్కడికక్కడే గుండెపగిలి ప్రాణాలు విడిచింది. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో జరిగిన ఈ విషాదఘటన స్థానికులను కన్నీరు పెట్టించింది. గ్రామానికి చెందిన అమృతమ్మ అనే వృద్ధురాలికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె కొడుకు వద్దే ఉంటోంది. అయితే, గత రెండు రోజులుగా తీవ్రమైన వేసవి వడగాల్పులు, వడదెబ్బకు గురైన అమృతమ్మ నీరసించి శనివారం కన్నుమూసింది. కన్నతల్లి మరణవార్త వినగానే కుమార్తె పద్మ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతూ పుట్టింటికి పరుగెత్తుకుంటూ వచ్చింది. ప్రాణానికి ప్రాణంగా పెంచిన అమ్మ ఇక లేదన్న చేదు నిజాన్ని పద్మ జీర్ణించుకోలేకపోయింది. తల్లి మృతదేహాన్ని పట్టుకుని రోదిస్తుండగానే ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. చూస్తుండగానే తల్లి పక్కనే పద్మ కూడా వాలిపోయింది. ఒకేరోజు, ఒకే ఇంట్లో తల్లీకూతుళ్లిద్దరూ మరణించడంతో ముత్తగూడెం గ్రామం శోకసంద్రమైంది. బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. విధి ఆడిన ఈ వింత నాటకం అందరినీ కలచివేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కస్టమర్లను ముంచేసిన గోల్డ్ అప్రైజర్.. రూ.40 లక్షల బంగారంతో పరార్
చెరువుపై పడ్డ ఊరు.. మొత్తం ఊడ్చేశారుగా
‘అణు చెత్త’ను తొలిసారిగా సమాధి చేస్తున్న ఫిన్లాండ్
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. ఈ టెక్నాలజీ వస్తే.. అందరికీ జీరో బిల్లులే
