వాషింగ్ మెషిన్లో పసిపిల్లలు.. ఏడిస్తే చిత్రహింసలు..! డే కేర్ సెంటర్లో దారుణం
బెంగళూరులోని ఓ డేకేర్ కేంద్రంలో చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. సీసీటీవీ ఫుటేజీలో పిల్లలను భయపెట్టడం, బాత్రూమ్లో బంధించడం, నీటితో వేధించడం వంటి దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఐదుగురు కేర్టేకర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, బాలల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లే సమయంలో తమ పిల్లలు క్షేమంగా ఉంటారని నమ్మి డేకేర్ సెంటర్లో వదిలి వెళ్తారు. కానీ అదే డేకేర్… పసిపిల్లలకు నరకంగా మారితే? బెంగళూరులోని ఓ ప్రముఖ డేకేర్ సెంటర్లో వెలుగులోకి వచ్చిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.రెండేళ్ల నుంచి మూడేళ్ల వయసున్న చిన్నారులను వాషింగ్ మెషిన్లో బంధించడం…చీకటి బాత్రూమ్లలో లాక్ చేయడం… టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి వేధించడం వంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి. ఈ ఘటనపై ఐదుగురు మహిళా కేర్టేకర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు అక్కడ ఏం జరిగింది? పసిపిల్లలపై ఇంతటి అమానుషానికి కారణమేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ హాల్ క్యాంపస్లోని డేకేర్ సెంటర్లో ఇలాంటి దారుణ ఘటన జరగడం ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. రెండేళ్ల వయస్సు గల చిన్నారులను డేకేర్ సిబ్బంది అత్యంత క్రూరంగా హింసించినట్లు సమాచారం. పసిపిల్లలని కూడా చూడకుండా వారిని వాషింగ్ మెషిన్ డ్రమ్లో బంధించడం, డార్క్ బాత్రూమ్లలో లాక్ చేసి, టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు చల్లి వేధించడం వంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వివరాల ప్రకారం… ఐటీ ఉద్యోగులు విధులకు వెళ్లే సమయంలో తమ చిన్నారులను ఈ డేకేర్ సెంటర్లో వదిలి వెళ్తున్నారు. అయితే అక్కడ పనిచేస్తున్న మంజుల, విజయలక్ష్మి, సింధు, భవాని, బిందు అనే ఐదుగురు మహిళా కేర్టేకర్లు…పిల్లలను సైలెంటుగా ఉంచడానికి ఈ పైశాచిక పద్ధతులు పాటిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. వైరల్ అయిన వీడియోల ప్రకారం, ఏడుస్తున్న చిన్నారులను సిబ్బంది ఫ్రంట్లోడింగ్ వాషింగ్ మెషిన్ డ్రమ్లో కూర్చోబెట్టి తలుపు మూసి భయపెట్టినట్లు కనిపిస్తోంది. చిన్నారులు భయంతో ఏడుస్తున్నా వారిపై కనికరం చూపకుండా ఇలా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. పిల్లలను నిశ్శబ్దంగా ఉంచేందుకు ఇలాంటి పద్ధతులను అనుసరించినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా, మరో వీడియోలో ఒక చిన్నారిని వెస్ట్రన్ టాయిలెట్ సీటుపై కూర్చోబెట్టి, టాయిలెట్ జెట్ స్ప్రేతో ముఖంపై, నోటిలోకి నీళ్లు చల్లుతూ వేధించిన దృశ్యాలు కనిపించాయి. ఆ పసివాడు భయంతో, బాధతో గుక్కపెట్టి ఏడుస్తున్నా సిబ్బంది కొంచం కూడా కనికరం చూపలేదు.ఈ వీడియోలు చూసిన తల్లిదండ్రులు, నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లలను మానసికంగా కుంగదీసేలా డేకేర్ సిబ్బంది వ్యవహరించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకున్నవారే ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై బెంగుళూరు పోలీసులు తీవ్రంగా స్పందించారు. మంజుల, విజయలక్ష్మి, సింధు, భవాని, బిందు అనే ఐదుగురు మహిళా కేర్టేకర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఈ వ్యవహారాన్ని కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. చిన్నారులపై జరిగిన ఆరోపణలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వైరల్ అయిన వీడియోలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తూ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. సంఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో సదరు ఐటీ కంపెనీ క్యాంపస్లో పనిచేస్తున్న సంబంధిత డేకేర్ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన అన్ని వీడియోలను సేకరించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే డేకేర్ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు, సీసీటీవీ పర్యవేక్షణ, సిబ్బంది నియామక విధానాలపై కూడా సమీక్ష చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పిల్లలను సురక్షితంగా ఉంచుతారనే నమ్మకంతో తల్లిదండ్రులు డేకేర్ కేంద్రాల్లో వదిలి వెళ్తారు. అలాంటి చోటే పసిపిల్లలపై ఇలాంటి అమానుష ఘటనలు జరగడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన చిన్నారుల భద్రత, డేకేర్ కేంద్రాల పర్యవేక్షణ, సిబ్బంది శిక్షణ వంటి అంశాలపై మరోసారి తీవ్రమైన చర్చకు దారితీసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమల శ్రీవారి తొలి దర్శన భాగ్యం ఈయనకే !
గంటల తరబడి కూర్చునే డెస్క్ ఉద్యోగులకు హెచ్చరిక!
ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బతకాలంటే.. అవి బలంగా ఉండాల్సిందే!
హోటళ్లలో 13వ నెంబర్ రూమ్, అంతస్తు ఎందుకు ఉండవు? అసలు రహస్యం ఇదే!
