పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ
కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల జాహ్నవి అదృశ్యమైన ఘటన రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. వారం రోజులుగా 200 మంది పోలీసులతో భారీ గాలింపు కొనసాగుతున్నా ఎలాంటి ఆధారాలు లభించలేదు. పెంపుడు కుక్క తిరిగి ఇంటికి వచ్చినా పాప జాడ దొరకకపోవడంతో కిడ్నాప్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సమగ్ర దర్యాప్తు కోరుతున్నారు.
కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన రెండేళ్ల జాహ్నవి మిస్సింగ్ కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. జాహ్నవి వెంట వెళ్లిన పెంపుడు కుక్క మాత్రం.. మంగళవారం సాయంత్రానికి ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. కానీ చిన్నారి మాత్రం ఇప్పటికీ తిరిగి రాలేదు. ఇక్కడే అసలు చిక్కుముడి మొదలైంది. పాప అడవిలో తప్పిపోయిందని పోలీసులు భావిస్తుంటే, కుటుంబ సభ్యులు మాత్రం కిడ్నాప్ అంటున్నారు. ప్రధానంగా ఈ మిస్సింగ్ కేసులో.. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న కొన్ని లాజికల్ పాయింట్స్ ఉన్నాయ్.. అవేంటంటే.. పాయింట్ నెంబర్ 1. రెండేళ్ల పాప ఎవరి సాయం లేకుండా కిలోమీటర్ల దూరం నడవగలదా? నెంబర్ 2. తోట చుట్టూ మనుషులు దాటలేని కంచె ఉంది, మరి, ఆ కంచెను దాటి చిన్నారి ఎలా వెళ్తుంది? నెంబర్ 3.పెద్దవాళ్లే ఎక్కలేని కొండప్రాంతంలోకి పాప వెళ్లిందని ఎలా అనుకోవాలి? లాస్ట్ పాయింట్. చిన్నారి తండ్రికి కొందరు స్థానికులతో ఉన్న ఆర్థిక వివాదాలు.. వీటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? ఒకవేళ కొందరు ఊహిస్తున్నట్టు ఏదైనా జరగకూడనిది జరిగి ఉంటే.. ఆ పరిసర ప్రాంతంలో దుర్వాసన రాకుండా ఎలా ఉంటుంది? జాహ్నవి తల్లితో సహా, గ్రామస్తులంతా కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, వారం రోజులు గడిచిపోయాయి..చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి..! కానీ, ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు. చుట్టూ దాదాపు 500 ఎకరాల అటవీ ప్రాంతం, కొండలు, లోయలు.. వెతకని చోటు లేదు. ఏకంగా 200 మంది పోలీసులు చిన్నారి జాడ కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.. డ్రోన్ కెమెరాలతో కూడా గాలించారు. అయినా ఫలితం శూన్యం. అసలు జాహ్నవి ఎక్కడుంది? పాప మిస్సింగ్పై కుటుంబసభ్యులు, పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. పాప కనిపించకుండా పోయి ఏడు రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్కకు..జీపీఎస్ ట్రాకర్ అమర్చి తోటల్లోకి వదిలారు పోలీసులు. రెండు గంటల పాటు తోట పరిసర ప్రాంతాల్లో 400 మీటర్ల పరిధిలోనే తిరిగిన కుక్క..చివరికి మళ్లీ ఇంటికి చేరుకోవడంతో ఎటువంటి ఆధారాలు లభించలేదు. నాన్న కోసమంటూ అడవిలోకి వెళ్లిన చిన్నారి జాహ్నవి అదృశ్యం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పాప ఎక్కడికి వెళ్లిందో, ఏమైందో తెలియడం లేదు. అసలు క్షేమంగా ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఆ కుటుంబానికి ప్రతీక్షణం ఒక యుగంలా గడుస్తోంది. అందరూ అనుకుంటున్నట్లుగా, జాహ్నవి అడవిలోనే తప్పిపోయిందా? లేక ఎవరైనా ఎత్తుకెళ్లారా? అసలు ఏం జరిగిందో తెలియక ఆ తల్లిదండ్రుల కన్నీళ్లను ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. ఇక, దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం సమీపంలోని 50 ఎకరాల పామాయిల్ తోటకు గణేశ్-భవానీ దంపతులు కాపలదారులుగా పనిచేస్తున్నారు. వారి రెండేళ్ల కూతురు జాహ్నవి గత శనివారం అడవి వైపు వెళ్లింది. అయితే చిన్నారి ఎంతకూ తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. దీంతో పెద్దాపురం డివిజన్కు చెందిన 200 మంది పోలీసు సిబ్బంది పాప జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 500 ఎకరాల అటవీ కొండ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మరోవైపు, జాహ్నవి కనిపించిక ఆ తల్లి భవానీ పడుతున్న బాధ చూస్తే గుండె బరువెక్కుతోంది. బోనులో ఉన్న కుక్క దగ్గరకు వెళ్లి భవానీ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆమె ఎంత బాధను అనుభవిస్తోందో అర్థమవుతుంది. జాను దగ్గరికి వెళ్తావా అంటూ పెంపుడు కుక్కను పదేపదే అడుగుతూ.. రోదిస్తున్న ఆ కన్నతల్లిని చూసి గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్ననే కుక్క తిరిగొచ్చిందని.. జానూ కూడా వచ్చేస్తుందని అనుకున్నానని చెబుతోంది చిన్నారి తల్లి భవాని. కానీ ఇంతవరకూ పాప ఆచూకీ దొరకలేదని బోరున విలపించింది. జాహ్నవి కుటుంబం కాపలా ఉంటున్న 50 ఎకరాల పామాయిల్ తోట.. దొండవాక పంచాయతీ CH అగ్రహారం పరిధిలో ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొండ ప్రాంతం మొదలవుతుంది. ఇప్పటికే పోలీసులు కొన్ని కిలోమీటర్ల రేడియస్లో ఆ ప్రాంతమంతా గాలించారు . దట్టమైన పొదలు, నేలబావులు, చెరువులు అన్నీ వెతికారు. డ్రోన్ కెమెరాతోనూ అణువణువూ జల్లెడబట్టారు. పాప మిస్సైన తర్వాతి రోజు కొండ ప్రాంతాల్లో భారీవర్షం పడడంతో ఎక్కడైనా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయా..? అలాంటి చోట చిన్నారి ఉండొచ్చా అనే అనుమానంతో అన్నిచోట్ల గాలించారు. కానీ ఇంతవరకూ ఎలాంటి క్లూ లేదు. ఇక ఫైనల్గా పోలీసులు కేవలం తోట పరిసరాల్లోనే గాలిస్తున్నారు తప్ప..కిడ్నాప్ ఆంశాన్ని సీరియస్గా తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని బస్టాండ్ తప్ప మరోచోట గాలించడం, సీసీ కెమెరాలను ట్రాక్ చేయడం వంటివి ఎందుకు చేయడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా, చిన్నారి జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఈ కేసులో ఏ చిన్న ఆధారం దొరికినా ఈ మిస్టరీ వీడుతుంది. మరి మీరేమంటారు? ఇది తప్పిపోవడం అంటారా? లేక కిడ్నాప్ అంటారా? కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎల్ నినో భయంకరమైన సవాల్.. వేడి ఎక్కువ, వర్షం తక్కువ..
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్ వల్ల బతికాను..
వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం..
మనీ మెషీన్! 90 నిమిషాల్లో రూ.30 కోట్లు సంపాదన
వైరల్ వీడియోలే వరుడికి విలన్లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!
