అదిరిపోయే వార్త! యూపీఐతో ఇక ఆ ఇబ్బంది లేదు! వీడియో
డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలో పెద్ద మార్పు! మీరు నిత్యం ఉపయోగించే యూపీఐ.. దాని ద్వారా చేసే లావాదేవీలు ఇకపై మరింత వేగంగా పూర్తి కానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు యూపీఐ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు, ఆ లావాదేవీ విజయవంతం కావడానికి కొంత సమయం పట్టేది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత 'సక్సెస్' అని వచ్చే వరకు ఎదురు చూడాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఈ సమయం కాస్త ఎక్కువగానే ఉండేది. అయితే, ఇకపై ఈ నిరీక్షణ సమయం దాదాపు 50 శాతం తగ్గనుంది.
జూన్ 16 నుంచి సవరించిన ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. వివిధ రకాల యూపీఐ లావాదేవీల గడువును సవరిస్తూ NPCI తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఒక లావాదేవీ పూర్తవడానికి పట్టే సమయాన్ని రెస్పాన్స్ టైమ్గా వ్యవహరిస్తారు. ఎన్పీసీఐ తాజా ఆదేశాల ప్రకారం, క్రెడిట్ లేదా డెబిట్కు సంబంధించిన లావాదేవీలు కేవలం 15 సెకన్లలోనే పూర్తవుతాయి. ప్రస్తుతం దీనికి 30 సెకన్లు పడుతోంది. అంతేకాదు, ట్రాన్సాక్షన్ స్టేటస్ తెలుసుకోవడం, విఫలమైన లావాదేవీల రివర్సల్, చిరునామా ధ్రువీకరణ వంటి ప్రక్రియలు కూడా 30 సెకన్ల నుంచి కేవలం 10 సెకన్లకు తగ్గనున్నాయి. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికే ఈ మార్పులు చేస్తున్నట్లు ఎన్పీసీఐ తన ప్రకటనలో తెలిపింది. పేటీఎం, ఫోన్పే వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులు జూన్ 16 నాటికి తమ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. యూపీఐ సేవలు 2016 ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభమయ్యాయి. ఇది మొబైల్ ఆధారిత తక్షణ చెల్లింపు వ్యవస్థ. దీని ద్వారా ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాకు తక్షణమే డబ్బును బదిలీ చేయవచ్చు. వివిధ బ్యాంకు ఖాతాలను ఒకే మొబైల్ అప్లికేషన్తో అనుసంధానించే సౌలభ్యం యూపీఐ సొంతం.