ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్.. మూడేళ్లలో కట్టేసిన చైనా రోబోలు
చైనా మరోసారి తన ఇంజనీరింగ్ సత్తాను ప్రపంచానికి చాటింది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన చోంగ్కింగ్ ఈస్ట్ హైస్పీడ్ రైల్వే హబ్ను కేవలం 38 నెలల్లో పూర్తి చేసింది. ఏఐ, 5జీ, రోబోటిక్ టెక్నాలజీతో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎలాన్ మస్క్ షేర్ చేసిన వీడియోతో ఈ అద్భుత నిర్మాణం మరింత వైరల్ అయింది.
అసాధ్యమైన విషయాలను ఊహాలుగా మారిస్తే ఏఐ అవుతుంది. కానీ అలాంటి అసాధ్యాలను చైనా సుసాధ్యం చేస్తుంది. ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే భారీ నిర్మాణాలను అత్యంత వేగంగా పూర్తి చేయడంలో చైనా మరోసారి తన సత్తా చాటింది. ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలను సృష్టించిన చైనా, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన చాంగ్కింగ్ ఈస్ట్ హైస్పీడ్ రైల్వే హబ్ను, తన రోబో సైన్యంతో కేవలం 38 నెలల్లో నిర్మించి కొత్త చరిత్ర సృష్టించింది. సముద్రంలో కిలోమీటర్ల కొద్దీ వంతెనలు నిర్మించినా.. కొండ కోనల్లో ఎత్తైన వారధులను కట్టినా.. అతి తక్కువ కాలంలో అత్యద్భుతంగా తీర్చిదిద్దడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడదే కోవలో ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన చాంగ్కింగ్ ఈస్ట్ హైస్పీడ్ రైల్వే హబ్ను తీర్చిదిద్దింది. కేవలం 38 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి.. తన నిర్మాణ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటుకుంది చైనా. భారీ స్థాయిలో రోబోలను వినియోగించి విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. చైనాలోని అతిపెద్ద నగరమైన చోంగ్కింగ్లో ఓ భారీ పర్వతాన్ని తొలిచి ఈ స్టేషన్ను నిర్మించారు. 40 వేల మంది కార్మికులు రాత్రీపగలు పనిచేసి ఈ మెగా ప్రాజెక్ట్ను పూర్తి చేశారు. స్టేషన్ నిర్మాణంలో 16 వేలకుపైగా టన్నుల బరువున్న స్టీల్ రూఫ్ను ముందుగా నేలపై ఫిట్ చేశారు. ఆపై హైడ్రాలిక్ లిఫ్టింగ్ టెక్నాలజీ, ప్రత్యేక రోబోటిక్ క్రేన్లను ఉపయోగించి 57 మీటర్ల ఎత్తులో బిగించారు. కొలతల విషయంలోనూ ఇంజనీర్లు పూర్తిగా ఏఐ టెక్నాలజీని వాడారు. ఈ రూఫ్ను నిలబెట్టే పిల్లర్ల నిర్మాణంలోనూ చైనా ప్రత్యేకతను చాటుకుంది. చోంగ్కింగ్ నగర చిహ్నమైన హువాంగ్జీ చెట్టు ఆకారంలో పిల్లర్లను వేశారు. 41 మీటర్ల ఎత్తు ఉండే ఈ పిల్లర్లను భారీ భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు. ఈ స్తంభాలు చెట్టు కొమ్మల్లా విస్తరించి ఉండటంతో స్టేషన్లోపలికి వెలుతురు రావడమే కాకుండా పైకప్పు బరువును సమానంగా పంపిణీ చేసేలా డిజైన్ చేశారు. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు 2022 మే నెలలో ప్రారంభించారు. 2025 జూన్లో స్టేషన్ను ప్రారంభించారు. దీనికి సంబంధించిన 6 నిమిషాల వీడియోను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ‘భవిష్యత్తుకు స్వాగతం. చైనా ఇప్పుడు ప్రపంచంలోనే విస్తృతమైన హైస్పీడ్ రైల్వే నెట్వర్క్ను నిర్వహిస్తోంది’ అని వెల్లడించారు. ఈ వీడియోను 5 కోట్ల మందికిపైగా చూశారు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాదిరిగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. చూసేందుకు ఏఐ క్రియేషన్లా ఉన్న ఈ అద్భుత రైల్వేస్టేషన్ 12.2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. హైస్పీడ్ రైళ్లతోపాటు మెట్రో రైళ్లు, బస్సులు, ట్యాక్సీలు, సుదూర ప్రయాణ రవాణా సౌకర్యాలకు ఇది నిలయంగా ఉంది. మొత్తం 12 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 15 ప్లాట్ఫామ్లు, 29 ట్రాక్లు, 8 అంతస్తులతో ఉన్న ఈ రైల్వే స్టేషన్.. గంటకు 16 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యం కలిగి ఉంది. ఏడాదికి 10 కోట్ల మంది దీని ద్వారా ప్రయాణించడానికి వీలుగా ఏర్పాట్లున్నాయి. ఉక్కు, గాజుతో రూపొందించిన ప్రత్యేక నిర్మాణ శైలివల్ల స్టేషన్లో సహజ కాంతి సమృద్ధిగా అందేలా తీర్చిదిద్దారు. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణం అంత ఈజీ కాదు. క్లిష్ట భౌగోళిక పరిస్థితులతో పాటు 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైన తీవ్రమైన ఎండల్లో పనులు చేపట్టాల్సి వచ్చింది. దీంతో చైనా అత్యాధునిక రోబో సాంకేతికతను రంగంలోకి దించింది. లేజర్ మార్గదర్శక వ్యవస్థతో పనిచేసే నాలుగు చక్రాల రోబోలను వినియోగించి కాంక్రీట్ ఉపరితలాన్ని సమతలంగా రూపొందించారు. లైడార్, ఏఐ, 5జీ టెక్నాలజీని ఉపయోగించి కాంక్రీట్ లెవెలింగ్లో మిల్లీమీటరు స్థాయి వరకూ కచ్చితత్వం సాధించారు. ఈ రోబోలు సాధారణ కార్మికుల కంటే మూడు రెట్లు వేగంగా పనిచేయడమే కాకుండా, నిర్మాణ వ్యయాన్ని 40 శాతం వరకు తగ్గించాయి. 800 కేజీల గ్లాస్ ప్యానెళ్లను కచ్చితత్వంతో అమర్చడానికి రోబోలను వినియోగించారు. దీనివల్ల 90శాతం ప్రమాద రిస్కు తగ్గింది. బహుముఖ దిశల్లో పనిచేసే వెల్డింగ్ రోబోలు, 24 గంటల పర్యవేక్షణ నిర్వహించే రోబోలు నిర్మాణ పనుల వేగాన్ని మరింత పెంచాయి. ఈ భారీ ప్రాజెక్టు విజయానికి రోబో ఆర్మీని వినియోగించడమే ప్రధాన కారణమని చైనా అధికారిక మీడియా కూడా వెల్లడించింది. రూ.66 వేల కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్.. న్యూయార్క్లోని ప్రసిద్ధ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ కంటే ఐదు రెట్లు పెద్దది. బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా ఇటీవల ఈ స్టేషన్ నిర్మాణ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. ఈ స్టేషన్ అందుబాటులోకి రావడంతో చైనాలోని 14 ప్రధాన నగరాలకు హై-స్పీడ్ రైలు ప్రయాణం సులభతరం కానుంది. చైనా తన హై-స్పీడ్ రైల్ నెట్వర్క్ను మరింత విస్తృతం చేస్తూ, మారుమూల పర్వత ప్రాంతాలను సైతం మెట్రో నగరాలతో వేగంగా అనుసంధానిస్తోంది. ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది. ఇంజనీరింగ్ నైపుణ్యం, ఆధునిక సాంకేతికత కలిస్తే పర్వతాల పైన కూడా అద్భుతాలు సృష్టించవచ్చని చోంగ్కింగ్ ఈస్ట్ స్టేషన్ నిరూపించింది. ఈ సాంకేతికత కేవలం వేగాన్ని పెంచడమే కాకుండా, ప్రమాదకరమైన పనుల్లో మానవ శ్రమకు ఉండే రిస్క్ను కూడా గణనీయంగా తగ్గించింది. దాదాపు 800 కిలోల బరువుండే భారీ గ్లాస్ ప్యానెళ్లను ఎత్తైన ప్రదేశాలలో అమర్చడానికి చైనా ఇంజనీర్లు ప్రత్యేకంగా రూపొందించిన రోబోలను ఉపయోగించారు. ఈ ప్రక్రియ వల్ల నిర్మాణ సమయంలో జరిగే ప్రమాదాల ముప్పు దాదాపు 90 శాతం వరకు తగ్గడమే కాకుండా, పనులు మూడు రెట్లు వేగవంతమయ్యాయని సదరు నిర్మాణ సంస్థ ఉన్నతాధికారులు వెల్లడించారు. వీటితో పాటు సైట్ వద్ద రాత్రింబవళ్లు భద్రతను పర్యవేక్షించే పెట్రోలింగ్ రోబోలు, అత్యంత కచ్చితత్వంతో కూడిన వెల్డింగ్ రోబోలు కూడా ఈ చారిత్రాత్మక నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి. మొత్తంగా ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తే నిర్మాణ రంగంలో ఎంత పెద్ద మార్పు సాధ్యమో ఈ ప్రపంచానికి చైనా మరోసారి చేసి చూపించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కీచక భర్తకు బుద్ధి చెప్పిన భార్య..ఏం చేసిందంటే
భారతీయ నర్స్ కుటుంబాన్ని బహిష్కరించిన ఆస్ట్రేలియా
టెకీలకు గడ్డుకాలం.. కెనడా , యూరప్ వైపు చూపు
