అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన పసికూన
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో నేపాల్ జట్టు చరిత్ర సృష్టించింది. సోమవారం షార్జా వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టెస్టు హోదా ఉన్న పూర్తిస్థాయి సభ్యత్వ జట్టుపై టీ20 ఫార్మాట్లో పసికూన నేపాల్కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 173 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఆరంభంలో అకీల్ హోసేన్, కైల్ మేయర్స్ దెబ్బకు తడబడినప్పటికీ, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా చెరో హాఫ్ సెంచరీ సాధించి జట్టును ఆదుకున్నారు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్, నేపాల్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నేపాల్ బౌలర్ మహమ్మద్ ఆదిల్ ఆలం నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. ఇది టీ20 క్రికెట్లో ఒక అసోసియేట్ జట్టు చేతిలో పూర్తిస్థాయి సభ్యత్వ జట్టు నమోదు చేసిన అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గతంలో 2014లో నెదర్లాండ్స్పై ఇంగ్లండ్ 88 పరుగులకు ఆలౌట్ అయిన రికార్డును ఇది బద్దలు కొట్టింది. మ్యాచ్ అనంతరం నేపాల్ ఆటగాడు ఆసిఫ్ షేక్ మాట్లాడుతూ, “ఈ పిచ్పై 160 పరుగులు మంచి స్కోరని భావించాం. నెమ్మదిగా ఆడి భాగస్వామ్యం నిర్మించాలనుకున్నాం, అదే చేశాం. మా దేశంలో క్రికెట్ ఒక పండుగలాంటిది. మాకు మద్దతు ఇచ్చే అభిమానులకు కృతజ్ఞతలు. సిరీస్ను 3-0తో గెలవాలని అనుకుంటున్నాం” అని తెలిపాడు. విండీస్ కెప్టెన్ అకీల్ హోసేన్ మాట్లాడుతూ, నేపాల్ విజయాన్ని ప్రశంసించాడు. నేపాల్పై సులువుగా గెలుస్తామని అందరూ అనుకున్నారని, కానీ వారు బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించారన్నారు. ఈ గెలుపునకు వారు పూర్తిగా అర్హులని వ్యాఖ్యానించారు. ఈ చారిత్రక విజయం టీ20 క్రికెట్లో వర్ధమాన జట్లు కూడా సత్తా చాటగలవని మరోసారి నిరూపించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్లో టీమిండియా క్రికెటర్ తిలక్వర్మ సందడి
Trump: మరోసారి సుంకాల బాంబు పేల్చిన ట్రంప్
H-1B వీసాలపై మరిన్ని కఠిన నిర్ణయాలు
నడిచి వెళ్లి చెట్లు ఎక్కే చేపను చూశారా ?? పరిశోధకులను ఆశ్చర్యపరుస్తున్న వింత
