కస్టమర్లకు షాక్..రీఛార్జ్ ధరలకు రెక్కలు
మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. మొబైల్ రీఛార్జ్ ధరలు పెరగనున్నట్టు తెలుస్తోంది. జూన్ 2026 నుండి మొబైల్ రీఛార్జ్లు పెంచేందుకు భారత టెలికాం సంస్థలు సిద్ధమవుతున్నట్టు ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. మొబైల్ సర్వీస్ రేట్లు దాదాపు 15% పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత టారిఫ్ పెంపు తర్వాత సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఈ పెరుగుదలకు సిద్ధమవుతున్నాయి సదరు సంస్థలు.
నివేదిక ప్రకారం, రిలయన్స్ జియో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPOకి, ఈ రంగం ఆదాయ వృద్ధిని వేగవంతం చేయడానికి ఇది కీలకం కానున్నట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత IPO మొత్తం టెలికాం రంగం విలువను పెంచడమే కాకుండా మొబైల్ సర్వీస్ రేట్ల పెరుగుదలకు పునాది వేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జియో తన మొబైల్ టారిఫ్లను 10% నుండి 20% వరకు పెంచవచ్చని నివేదిక అంచనా వేసింది. ప్రధానంగా దాని విలువను ప్రత్యర్థి భారతీ ఎయిర్టెల్కు దగ్గరగా తీసుకురావడానికి, పెట్టుబడిదారులకు రెండంకెల అంతర్గత రాబడిని అందించడానికి అని నివేదికలు చెబుతున్నాయి.ఈ టారిఫ్ పెంపు టెలికాం కంపెనీల ఆదాయాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ 2026 తో పోలిస్తే 2027 లో ఈ రంగం ఆదాయ వృద్ధి రేటు రెండింతలు ఎక్కువగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. జూన్ 2026లో 15% హెడ్లైన్ టారిఫ్ పెంపు 2027లో సగటు ఆదాయంలో 14% వృద్ధికి దారితీస్తుందని కూడా అంచనా వేసింది. అయితే అధిక టారిఫ్ల కారణంగా కొత్తగా చేరే సబ్స్క్రైబర్ల సంఖ్య పడిపోవచ్చని నివేదిక హెచ్చరిస్తోంది.
