పార్లమెంట్ నాలుగోరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభ, రాజ్యసభ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. 18వ లోక్సభ ఏర్పడిన తర్వాత పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించడం ఇదే తొలిసారి. కొత్త లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సమావేశాలు ఇవ్వాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఓటర్ల విశ్వాసాన్ని చూరగొన్న తర్వాత ఇక్కడికి వచ్చారని.. దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుందంటూ పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషిచేయాలని సూచించారు. ఈసారి ఎన్నికలు ఎంతో ప్రత్యేకమని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలని అన్నారు. దాదాపు 64 కోట్ల మంది ఓటర్లు తమ కర్తవ్యాన్ని ఉత్సాహంగా నిర్వర్తించారన్నారు. ఈసారి కూడా మహిళలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారని.. ఈ ఎన్నికలకు సంబంధించిన చాలా ఆహ్లాదకరమైన దృశ్యం జమ్మూ కాశ్మీర్ లో కనిపించిందన్నారు. కశ్మీర్ లోయలో దశాబ్దాల తర్వత రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిందన్నారు. జమ్మూకశ్మీర్ విషయంలో శత్రువులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ మూడు మూల స్తంభాలైన తయారీ, సేవలు, వ్యవసాయానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పీఎల్ఐ పథకాలు, వ్యాపారాన్ని సులభతరం చేయడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయన్నారు. సాంప్రదాయ రంగాలతో పాటు, సన్రైజ్ సెక్టార్లను కూడా మిషన్ మోడ్లో అబివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా క్షేమం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకున్నామని.. తెలిపారు.