కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కర్నూలు జిల్లాలో అప్పుచేసి సాగు చేసిన సొరకాయ పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టంతో రామలింగప్ప అనే రైతు తన పంటను రోడ్డుపై పారబోశాడు. రూ. 1.50 లక్షలు అప్పుచేసి పండించిన పంటకు కనీసం కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో అన్నదాత ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ఆదుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆకాశం వైపు చూస్తే వర్షాలు లేవు.. తీరా కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తీసుకెళ్తే కొనే నాథుడు లేడు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట చేతికొచ్చినా, కనీసం కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో ఓ రైతు తన ఆవేదనను ఆవేదనను వ్యక్తం చేస్తూ కష్టపడి పండించిన పంటను నిస్సహాయ స్థితిలో రోడ్డుపై పారబోశాడు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అన్నదాత దుస్థితికి అద్దం పడుతోంది. ఆర్లబండ గ్రామానికి చెందిన రామలింగప్ప అనే రైతు తనకున్న రెండెకరాల భూమిలో సుమారు రూ. 1.50 లక్షలు అప్పు చేసి సొరకాయ పంటను సాగు చేశాడు. పంట దిగుబడి బాగానే వచ్చినప్పటికీ, మార్కెట్లో ధరలు పూర్తిగా పడిపోయాయి. స్థానిక మార్కెట్కు పంటను తరలించినా కనిష్ట ధర కూడా పలకకపోవడంతో, కనీసం కోత కోసిన కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామలింగప్ప, తన పంటను కామన్రెడ్డి గ్రామ రోడ్డుపై పారబోసి తన నిరసనను, ఆవేదనను వ్యక్తం చేశాడు. ఏడాదికి 3 నుండి 4 లక్షల వరకు పెట్టుబడులు పెడుతున్నామని, అయినా గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని అని రైతులు వాపోతున్నారు. అప్పులు తీర్చలేక, పిల్లాపాపలతో కలిసి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, గిట్టుబాటు ధర కల్పించాలని మరియు నష్టపోయిన ఉద్యానవన రైతులను ఆదుకోవాలని రామలింగప్పతో పాటు స్థానిక రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే
Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం
భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం