భయం భయంగా తిరుమలకు శ్రీవారి భక్తులు
తిరుమల శ్రీవారి భక్తులను వన్యప్రాణుల భయం వెంటాడుతోంది. కొన్నాళ్లుగా సద్దుమణిగిన చిరుతపులుల సంచారం మళ్లీ మొదలైంది. ఇటీవలే శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత కనిపించి భక్తులను భయాందోళనకు గురిచేసింది. తాజాగా భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. మంగళవారం రాత్రి తిరుమల ఘాట్రోడ్డులో కనిపించిన భారీ కొండచిలువను చూసి భక్తులు షాకయ్యారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. రాత్రి 9 గంటల సమయంలో వినాయక స్వామి ఆలయం దాటిన వెంటనే రోడ్డు దాటుతున్న ఆ కొండచిలువను చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కారులో వెళ్తున్న కొందరు భక్తులు ఆ దృశ్యాన్ని చూసి వాహనాలను ఆపి దూరం నుంచే మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. కొన్ని నిమిషాలపాటు ఆ కొండ చిలువ రహదారిపైనే ఉండటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం అది నెమ్మదిగా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. భక్తులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సుమారు 10 అడుగుల పొడవున్న పాము రోడ్డు దాటుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత పెద్ద కొండ చిలువను దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి అని పలువురు భక్తులు ఆశ్చర్యపోయారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కొండ ప్రాంతాల గుండా వెళ్తున్న రహదారుల్లో ఇలాంటి జంతువులు తరచూ దర్శనమిస్తుంటాయని, భక్తులు భయపడవలసిన అవసరం లేదని వారు తెలిపారు. రాత్రివేళల్లో వాహనాలు నెమ్మదిగా నడపాలని, వన్యప్రాణులు కనిపించినప్పుడు వాటిని దగ్గరగా వెళ్లి చిత్రీకరించడం లేదా ఆటంకం కలిగించడం చేయవద్దని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివయ్యకు ఓ భక్తురాలి నివేదన.. ఏం చేసిందంటే
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. ఇక అధిక బిల్లుల బాధే ఉండదు
మరో ఆర్టీసీ బస్సు దగ్ధం.. ప్రయాణికులంతా సేఫ్
ఆ పాత్రికేయుడి విగ్రహానికి ముద్దులతో మహిళల నివాళి.. ఎందుకో తెలుసా ??
