నటి ప్రత్యూష కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Updated on: Nov 22, 2025 | 12:38 PM

2002లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డికి విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ దాఖలైన క్రిమినల్‌ అప్పీళ్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు శిక్షను తగ్గించగా, దీనిపై సుప్రీంలో వాదనలు పూర్తయ్యాయి. ప్రత్యూష తల్లి శిక్షను పెంచాలని అప్పీల్ చేయగా, నిందితుడు శిక్షను సవాల్ చేశాడు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది.

20 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్‌ చేసాడు నిందితుడు సిద్ధార్థరెడ్డి. నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్‌ అప్పీళ్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్‌ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా… సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. ఇద్దరూ కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్‌ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది.దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సీబీఐ… నిందితుడిపై 306 ఆత్మహత్యకు పురికొల్పడం, 309 ఆత్మహత్యకు యత్నించడం సెక్షన్ల కింద ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరిలో తీర్పు చెప్పారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా… జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. సీబీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది నచికేత జోషి వాదనలు వినిపిస్తూ… కేసులో సాక్ష్యాధారాలన్నీ నిరూపితమయ్యాయన్నారు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకొనేలా ఉసిగొల్పిన సిద్ధార్ధ్‌కు సెక్షన్‌ 302 కింద శిక్ష విధించాలని, సాధ్యం కాకపోతే సెక్షన్‌ 306 కింద గరిష్ఠ శిక్ష విధించాలని విన్నవించారు. మృతురాలు, నిందితుడు ఇద్దరూ కలిసి పురుగుమందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరఫున సీనియర్‌ న్యాయవాదులు నాగముత్తు, ఎల్‌.నరసింహారెడ్డి వాదించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌

Samantha: సమంత పై రాజ్ నిడిమోరు కామెంట్స్‌

కోచింగ్‌ సెంటర్‌లో పరిచయం.. ఐబొమ్మ రవి లవ్‌ స్టోరీ

ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ డ్రైవర్‌.. ఏం చేశాడంటే

కారు డ్రైవర్‌ దాష్టీకం.. సైడ్‌ ఇవ్వలేదని