వామ్మో.! తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్
నైరుతి బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. తీరం వెంబడి గంటకు 80 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. NDRF బృందాలు మోహరించి, అధికారులు సహాయక చర్యలకు సన్నద్ధమయ్యారు.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందుజాగ్రత్త చర్యగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను తీరం దాటే అవకాశం లేనప్పటికీ, తీరం వెంబడి కదులుతూ బలహీనపడనుందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం నాటికి ఈ తుపాను చెన్నైకి దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంగా రానుంది. తుపాను ప్రభావంతో ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా మారడంతో సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబరు, విశాఖ, మచిలీపట్నం, కాకినాడ సహా ఇతర పోర్టులకు రెండో నంబరు ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించే అవకాశం ఉందన్న IMD హెచ్చరికలతో కడప జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్తోపాటు జమ్మలమడుగు RDO ఆఫీసు, బద్వేలు, పులివెందుల, అన్నమయ్య RDO కార్యాలయాల్లో సాయం కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇటు నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాను ప్రభావంపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదలు వచ్చే అవకాశం ఉన్న పెన్నా పరివాహక ప్రజలను అలర్ట్ చేయాలని ఆదేశించారు. వరద నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. NDRF అదనపు బృందాలను మోహరించారు. తమిళనాడులో 14, పుణె, వడోదర నుంచి మరో 10 అదనపు బృందాలు తరలించారు. ఏపీలో రెండు అదనపు బృందాలను మోహరించారు. అవసరమైతే రిజర్వ్ బృందాల తరలింపునకు కేంద్రం సిద్ధమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

