అరకు చలి ఫెస్ట్‌లో ఆడిపాడిన అధికారులు

Updated on: Feb 02, 2026 | 6:36 PM

అరకు లోయలో జరుగుతున్న 'అరకు చలి ఫెస్ట్' గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈ వేడుకల్లో హెలిప్యాడ్ టూరిజం ప్రారంభించి, పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం రూ.1000 కోట్లతో 'అడవి తల్లి బాట' కార్యక్రమాన్ని చేపట్టింది. పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి, ‘సే నో టు డ్రగ్స్’ సైక్లింగ్ ర్యాలీ ఫెస్ట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గిరిజన నృత్యాలు, పైనరీ అడవులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రకృతి రమణీయతకు నెలవైన అరకు లోయలో నిర్వహిస్తున్న ‘అరకు చలి ఫెస్ట్’ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ , పాడేరు ఐటీడీఏ పీఓ తిరువని శ్రీ పూజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌… ఈ ఉత్సవాలు గిరిజన సంస్కృతి, జీవనశైలిని ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా నిలుస్తున్నాయన్నారు. అరకులోయ మండలం కొత్తవలస ఉద్యానవన కేంద్రంలో హెలిప్యాడ్ టూరిజం ను ప్రారంభించారు కలెక్టర్ దినేష్ కుమార్, పాడేరు ఐటీడీఏ పీఓ తిరువని శ్రీ పూజ. అరకులోని పైనరీ వంటి ప్రాంతాలు పర్యాటకులకు కలల ప్రపంచాన్ని తలపిస్తున్నాయని, దాదాపు 50 ఏళ్ల నాటి పైనరీ చెట్లతో నిండిన ఈ అడవిని సృష్టించడం సామాన్యమైన విషయం కాదని కలెక్టర్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గత ఏడాది కాలంలోనే రూ.100 కోట్లతో రహదారుల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గనిర్దేశంలో ‘అడవి తల్లి బాట’ కార్యక్రమం కింద రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అరకు ఉత్సవంలో భాగంగా అరకు ఫెస్టివ్‌ 2026 కార్నివాల్ ను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్,పాడేరు ఐటిడిఏ పిఓ తిరువని శ్రీ పూజ, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దొన్నుదొర. ఈ సందర్భంగా అధికారులు గిరిజనులతో కలిసి నృత్యాలు చేస్తూ ఆడిపాడారు. పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా పర్యాటక అభివృద్ధి చేపడుతున్నామని, త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్యారవాన్ పార్క్, రెస్టారెంట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. విశాఖపట్నం నుంచి రెండు గంటల ప్రయాణంతో చేరుకునే అరకు లోయ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోందన్నారు. ఫెస్ట్‌లో భాగంగా ‘సే నో టు డ్రగ్స్’ నినాదంతో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. లోతేరు జంక్షన్ నుంచి పైనరీ వరకు సాగిన ఈ ర్యాలీలో 42 మంది పాల్గొన్నారు. పోటీల్లో విశాఖపట్నంకు చెందిన కె.వంశీ కిరణ్ మొదటి స్థానంలో నిలిచి రూ.25,000 బహుమతిగా పొందారు. ఎన్. అఖిలేష్ రెండో స్థానం లో నిలిచి రూ.15,000, జి. శ్యాం మనోహర్ మూడో స్థానంలో నిలిచి రూ.10,000 గెలుచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ స్పందిస్తూ…డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాకినాడ సముద్రంలో భారీ చేపలు.. ఆనందంలో గంగపుత్రులు

హైదరాబాద్ కాల్పులపై సీపీ సజ్జనార్‌ కీలక వివరాలు

సౌమ్య కుటుంబానికి ‘కోటి’ ఎక్స్‌గ్రేషియా

Nirmala Sitharaman: ఇక జిల్లాకో బాలికల హాస్టల్..

మెగా వారసుడు పుట్టిన వేళ.. బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్న చిరు-బాలయ్య