టీ సర్కార్ కీలక నిర్ణయం: కరోనా పేషెంట్ల డైట్ చార్జీల పెంపు!
ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక తాజాగా, రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగుల డైట్ చార్జీలను కూడా ప్రభుత్వంపెంచుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరింత ప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో ఉచితంగా కరోనా టెస్టులతో పాటు చికిత్స అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇక తాజాగా, రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగుల డైట్ చార్జీలను కూడా ప్రభుత్వంపెంచుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు కోవిడ్ బాధితులకు అందిస్తున్న భోజనానికి రోజుకు సాధారణ డైట్కు రూ.40, హైప్రొటీన్ డైట్కు రూ.56 చొప్పున చెల్లిస్తుంది ప్రభుత్వం. అయితే కొవిడ్ ఆస్పత్రిగా మార్చిన తర్వాత కరోనా పేషెంట్లకు బలవర్థకమైన ఆహారాన్ని ఇస్తున్నారు. అందుకోసం డైట్ చార్జీని రూ.275కు పెంచారు. హైదరాబాద్లోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ రోగులకు మాత్రమే ఈ డైట్ చార్జీ వర్తించనుంది. అలాగే జిల్లాల్లో అయితే రూ.200గా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో విడుదల కానున్నట్లు అధికార వర్గాల సమాచారం.
ఇక గాంధీలో కోవిడ్ పేషెంట్లకు అందించే మెనెలో ..ఉదయం 7 గంటలకు – బ్రెడ్, పాలు ఇస్తున్నారు. ఉదయం 8 గంటలకు- అల్పాహారంగా ఉప్మా, ఇడ్లీ, వడ, పూరి- ఏదో ఒకటి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చే భోజనంలో కూర, పప్పు, సాంబారు, గుడ్డు, హైప్రొటీన్ గింజలు, సీ విటమిన్ పండు, వాటర్ బాటిల్ను అందజేస్తున్నారు. ఇక మధ్యాహ్నం 3గంటలకు – టీ, బిస్కెట్లు ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు 100 గ్రాముల డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నారు. రాత్రి గం.7.30- భోజనంలో చపాతి, పుల్కా, అన్నం, కూర, రసం, పెరుగు, ఒక వాటర్ బాటిల్. రాత్రి 9 గంటలకు – గ్లాసుడు పాలు, పండ్లు ఇస్తున్నారు.