
రాత్రి పడింది. పట్టాలపై రైలు వేగంగా దూసుకుపోతున్నప్పుడు వచ్చే శబ్దం, ఆ ఢమఢమల చప్పుడు ప్రయాణికులను ప్రశాంతమైన నిద్రలోకి జోకొడుతుంది. కోచ్లలోని చాలా మంది నిద్రపోతున్నారు. కానీ, అదే సమయంలో ఇంజిన్ లోపల ఒక విభిన్న ప్రపంచం మేల్కొంటోంది. విధి నిర్వహణలో ఉన్న లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ నిద్రమత్తులో లేరు, పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. వారి ప్రతి మాట, ప్రతి నిర్ణయం ప్రయాణికుల భద్రతకు సంబంధించినదే. రాత్రి వేళల్లో రైలు ప్రయాణం సురక్షితంగా సాగడం వెనుక లోకో పైలట్లు పాటించే నియమాలేంటో తెలుసా..?
రైలు నడపడం అనే బాధ్యత కేవలం ఇంజన్లోకి ప్రవేశించడంతోనే మొదలవ్వదు. ప్రయాణానికి ముందు లోకో పైలట్కు మొత్తం మార్గం గురించి వివరిస్తారు. అతని వద్ద ప్రతి మలుపు, వాలు, వేగ పరిమితి, ట్రాక్ పరిస్థితిని వివరిస్తూ ఒక ఖచ్చితమైన రూట్మ్యాప్ ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, ప్రయాణికులు తమ సీట్ల కోసం వెతుక్కునే సమయానికే, పైలట్ అప్పటికే మొత్తం మార్గాన్ని తన మనసులో రూపుదిద్దుకుని ఉంటాడు.
ఇక, రాత్రి పూట సుదీర్ఘ ప్రయాణాల్లో లోకో పైలట్లు అలసిపోయి నిద్రపోయే అవకాశం ఉంటుంది. కానీ, ఇది చాలా ప్రమాదకరం. అందుకే, రైల్వే వ్యవస్థలో ఒక ప్రత్యేక సంకేత పద్ధతి అమలులో ఉంది. రైలు ఏదైనా స్టేషన్ను దాటుతున్నప్పుడు లేదా మరొక రైలు పక్క నుంచి వెళ్తున్నప్పుడు, లోకో పైలట్లు తమ వద్ద ఉన్న టార్చ్ లైట్ను వెలిగించి ఆపి చూపిస్తారు.
స్టేషన్ మాస్టర్ లేదా ట్రాక్ పక్కన ఉండే సిబ్బంది రాత్రి పూట పచ్చని లైట్ (Green Light) చూపిస్తారు. దీనికి ప్రతిస్పందనగా లోకో పైలట్ కూడా తన లైట్ను వెలిగించాలి. దీని అర్థం లోకో పైలట్ అప్రమత్తంగా ఉన్నాడని సూచిస్తుంది. డ్రైవర్ నిద్రపోవడం లేదని, ట్రాక్పై దృష్టి పెట్టాడని దీని ద్వారా అర్థమవుతుంది. రైలులో అన్నీ సక్రమంగా ఉన్నాయని, ఎటువంటి సాంకేతిక లోపాలు లేవని ఈ సంకేతం సూచిస్తుంది.
కేవలం లైట్ సంకేతాలే కాకుండా, ఆధునిక రైళ్లలో విజిలెన్స్ కంట్రోల్ డివైజ్ ఉంటుంది. ఒకవేళ లోకో పైలట్ నిర్ణీత సమయంలో (సుమారు ఒక నిమిషం) హారన్ కొట్టకపోయినా లేదా బ్రేక్ వేయకపోయినా, ఈ మిషన్ అలారమ్ మోగిస్తుంది. అప్పటికీ స్పందన లేకపోతే రైలు ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న సంకేతాలు, సాంకేతిక జాగ్రత్తలే కోట్లాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. రైల్వే శాఖలోని ఈ ఆసక్తికరమైన అంశం ప్రయాణికులకు భద్రతపై నమ్మకాన్ని కలిగిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..