
సుమారు 15,000 ఏళ్ల క్రితం నాటి మానవుల ఆహార అలవాట్లపై పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగుచూశాయి. మానవులు వ్యవసాయం ప్రారంభించడానికి ముందు కాలంలోనే, తమ ఆకలి తీర్చుకోవడానికి అందుబాటులో ఉన్న ప్రమాదకర ప్రాణులను కూడా ఆహారంగా మార్చుకునే నైపుణ్యాన్ని సాధించారని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఇస్రేల్ ప్రాంతంలో వికసించిన నాటుఫియన్ సంస్కృతికి చెందిన మానవ నివాస స్థలాల్లో జరిపిన తవ్వకాల ఆధారంగా ఈ పరిశోధన సాగింది. నాటుఫియన్లు వేటగాళ్లుగా ఉంటూనే, ఒకే ప్రాంతంలో స్థిరనివాసాలు ఏర్పరచుకోవడం ప్రారంభించిన తొలి మానవ సమూహాలలో ఒకరు. వీరు వ్యవసాయం విస్తృతంగా ప్రారంభించడానికి సరిగ్గా ముందరి కాలంలో జీవించారు.
పరిశోధకులు తవ్వకాల్లో లభించిన వేలాది ప్రాచీన ఎముకల అవశేషాలను మైక్రోస్కోపిక్ విశ్లేషణ ద్వారా పరిశీలించారు. అందులో వివిధ రకాల పాములు, బల్లులు, ఊసరవెల్లుల ఎముకలు లభించాయి. ఈ ఎముకలపై నిప్పుతో కాల్చిన గుర్తులు, మానవ పళ్ల గాట్లు స్పష్టంగా కనిపించాయి. దీనిని బట్టి వారు సరీసృపాలను ఉడికించి లేదా నిప్పుపై కాల్చి తిన్నారని నిపుణులు నిర్ధారించారు.
మానవులు కేవలం పెద్ద పెద్ద జంతువులపైనే కాకుండా, తమ చుట్టూ ఉండే చిన్న చిన్న ప్రాణులు, సరీసృపాలపై కూడా ఆహారం కోసం ఆధారపడేవారని ఈ రీసెర్చ్ నిరూపిస్తోంది. తీవ్రమైన పర్యావరణ మార్పులు, ఆహార అభద్రత ఏర్పడినప్పుడు ప్రాచీన మానవులు తమ మనుగడను సాగించడానికి ఎంతగా పోరాడారో తెలిపేందుకు ఈ కొత్త ఆధారాలు అద్దం పడుతున్నాయి.