Viral Video: ముంబైలో 107 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్‌… 1932లో ముంబై మునిగిపోయిన వీడియో వైరల్‌

అతి భారీ వర్షాలతో...దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో...

Viral Video: ముంబైలో 107 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్‌... 1932లో ముంబై మునిగిపోయిన వీడియో వైరల్‌
Mumbai Heavy Rains

Updated on: May 27, 2025 | 3:05 PM

అతి భారీ వర్షాలతో…దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. రోడ్లపై నీరు ఉదృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ట్రాక్‌లపైకి వాన నీరు చేరడంతో రైల్వే సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులపై ప్రభావం పడింది. వర్లీ మెట్రో స్టేషన్‌కు వరదనీరు పోటెత్తింది. ప్లాట్‌ఫామ్‌లు కూడా నీట మునిగాయి. భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో మెట్రోసర్వీసులకు ఆటంకం ఏర్పడింది. విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. దాదర్‌, మహిమ్‌, పరెల్‌, బాంద్రా, కాలాచౌకీ ప్రాంతాల్లో ఐఎండీ, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. విరార్‌లోని గోప్చర్‌పాడా ప్రాంతంలోని పూజా అపార్ట్‌మెంట్స్‌లో శ్లాబ్‌ కూలిపోయి లక్ష్మీరాజుసింగ్‌ అనే మహిళ మృతి చెందారు. ఇద్దరు చిన్నపిల్లలు ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో పాత భవనాల్లో నివసిస్తున్నవాళ్లు బెంబేలెత్తిపోయారు.

ముంబైలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయింది. దక్షిణ ముంబైలో వర్షం దంచికొట్టింది. కొలాబాలో 295 మి.మీ, శాంటాక్రజ్‌ 55 మి.మీ, బాంద్రా 68.5 మి.మీ, జుహు ఎయిర్‌పోర్ట్‌ 63.5 మి.మీ, చెంబూర్‌ 38.5 మి.మీ, విక్రోలి 37.5 మి.మీ, మహాలక్ష్మి 33.5 మి.మీ, సియోన్‌ ఏరియాలో 53.5 మి.మీ వర్షపాతం నమోదయింది. మే నెలలో 107 ఏళ్లలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే.

ఇక ముంబైలోని జుహు సముద్ర తీరంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి. 10 నుంచి 14 అడుగుల ఎత్తున రాకాసి కెరటాలు విరుచుకుపడ్డాయి. మహారాష్ట్ర కోస్టల్‌ గార్డ్స్‌, బీచ్‌ లైఫ్‌ గార్డ్స్‌, పోలీస్‌ సిబ్బంది రంగంలోకి దిగి పర్యాటకులను బీచ్‌ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. ఎవరు బీచ్‌లోకి రాకుండా ఆంక్షలు విధించారు.

భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. పుణె నగరం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ముంబై, థానే, రాయగడ్‌, రత్నగిరి ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ ప్రాంతాలతో పాటు వీటి పొరుగు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సారి మహారాష్ట్రలో పది రోజుల ముందుగానే.. నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది.

 

వీడియో చూడండి: