
బీసీ రిజర్వేషన్ల విషయంలో కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపాయి. మల్లన్న వ్యాఖ్యలపై మండిపడ్డ తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్పై దాడి చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. జాగృతి కార్యకర్తలు దాడి చేస్తున్న సమయంలో తీన్మార్ మల్లన్న గన్మన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో మల్లన్న ఇద్దరు గన్మన్ల వ్యవహారంపై పోలీసుల ఫోకస్ పెట్టింది. ఇద్దరు గన్మన్లను పోలీస్ శాఖ సరెండర్ చేసింది. ఇద్దరి స్టేట్మెంట్ రికార్డు చేసింది పోలీస్ శాఖ. మల్లన్న చెబితేనే కాల్పులు జరిపామని గన్మన్లు చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఎమ్మెల్సీ కవితపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ జాగృతి కార్యర్తలు తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్ సహా ఇతర వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ మల్లన్నపై కూడా దాడికి ప్రయత్నిచడంతో ఆయన గన్ మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఎపిసోడ్లో అటు తీన్మార్ మల్లన్న ఇటు కవిత ఎవరూ తగ్గడం లేదు సై అంటే సై అంటున్నారు. కవిత తనపై హత్యాయత్నం చేయించారని మల్లన్న ఆరోపించారు. తాను అన్నది తెలంగాణ సామెత మాత్రమేనని తన వ్యాఖ్యలపై తగ్గేది లేదన్నారు ఎమ్మెల్సీ మల్లన్న. బీసీల పార్టీ ప్రకటించడంతో కవిత తనపై దాడి చేయించారని.. బీసీలను అణచివేయాలని ప్రయత్నిస్తున్న కవితను రాష్ట్రంలో బీసీలు తిరగనివ్వరని హెచ్చరించారు మల్లన్న.
అయితే తీన్మార్ మల్లన్న తన వ్యాఖ్యలను సమర్థించుకోవడంపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఆడబిడ్డను నోటికొచ్చినట్టు మాట్లాడి తెలంగాణ సామెత అన్నానంటే సహించేది లేదన్నారు కవిత. మహిళనని చూడకుండా మల్లన్న హీనమైన మాటలు మాట్లాడారని…ఆడబిడ్డలు తలచుకుంటే మల్లన్న బయట తిరగలేడన్నారు కవిత. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదని, వెంటనే మల్లన్నను అరెస్ట్ చేయాలని లేకపోతే మల్లన్నతో సీఎం మాట్లాడించినట్టు భావిస్తామన్నారు కవిత. సీఎం ఇంటి బిడ్డలకు ఓన్యాయం? ఇతరులకు మరో న్యాయమా? అని కవిత ప్రశ్నించారు.
ప్రభుత్వం మల్లన్నపై చర్యలు తీసుకోకపోతే NHRCని కూడా కలుస్తానని కవిత అన్నారు. మరోవైపు జాగృతి కార్యకర్తలు దాడి చేసిన సమయంలో తీన్మార్ మల్లన్న చెబితేనే కాల్పులు జరిపామని ఆయన గన్మెన్ చెబుతున్నారు. ఇటు కవిత నివాసంతో పాటు జాగృతి కార్యాలయం దగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు. ఇటు మల్లన్న, కవిత ఎసిసోడ్పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కవిత, మల్లన్న ఇద్దరూ సంయమనంతో వ్యవహరించాలని… దాడులు చేసుకోవడం తెలంగాణ సంస్కృతి కాదని అద్దంకి దయాకర్ అన్నారు. మాటల నుంచి దాడుల వరకూ వెళ్లిన మల్లన్న, కవిత ఎపిసోడ్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.