Viral: ఓరీ దేవుడో ఇదేం మొక్కుబడిరా బాబు..నెత్తిమీదే మంట పెట్టి.. పొంగల్‌ వండేస్తున్నారు..!

|

Mar 02, 2022 | 9:55 PM

టెక్నాలజీలో... ఎక్కడికో వెళ్లిపోయాడు మనిషి. అంతరిక్షపు అంచుల్ని కూడా దాటేసి.. అవతలివైపు ఏముందో కూడా చూసొచ్చేశాడు. అయినా, మూఢవిశ్వాసాల్ని నమ్మడంలో, వింత ఆచారాల్ని కొనసాగించడంలో... అంతకు పైనే ఉన్నాడు.

Viral: ఓరీ దేవుడో ఇదేం మొక్కుబడిరా బాబు..నెత్తిమీదే మంట పెట్టి.. పొంగల్‌ వండేస్తున్నారు..!
Scary Festival
Follow us on

Tamil Nadu: దేవుడికి మొక్కు తీర్చుకోవడం.. కొత్త విషయమా? అస్సలు కాదు. తరతరాలుగా, యుగయుగాలుగా.. ఈ మొక్కుల సంప్రదాయం మొక్కుబడిగానో, బాధ్యతగానో కొనసాగుతూనే ఉంది. జాతి, మత, వర్గ బేధాలేవీ లేకుండా.. యథేచ్చగా కొనసాగుతున్న ఏకైక సంప్రదాయం ఈ మొక్కుబడులే. అసలు దేవుడికి మొక్కులెందుకు చెల్లించుకుంటారు? ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగానో… కోరిన కోర్కెలు తీరాయన్న సంతోషంతోనే తీర్చుకుంటారు. అంతేగాని… నిలిచిన ప్రాణాలు నిట్టనిలువునా నువ్వే తీసేస్కో సామీ.. నువ్వే తీస్కో తల్లీ.. అని మొక్కులు చెల్లించుకుంటారా? అలా చేస్తే.. ఆ దైవం మనిషి కోరికను మన్నించిన దానికి అర్థమేముంటుంది. ఇలాంటి ప్రశ్నలు రేకెత్తించే వింతాచారమే… తమిళనాట మొక్కుబడుల రూపంలో రాజ్యమేలుతోంది.

ఇంట్లో కుంపటి పెట్టుకుంటే ఇంటిళ్ల పాదీ చలి కాచుకోవచ్చు… అదే కుంపటి పొయ్యిలా వెలిగిస్తే… ఇంట్లో అందరికీ సరిపడా భోజనం సిద్ధం చేసుకోవచ్చు. కానీ, ఇలా మనిషి నెత్తిన పొయ్యి పెడితే.. ఆ పొయ్యిపైన పొంగల్‌ పొంగిస్తే… ఏంటి పరిస్థితి? ఏమాత్రం తేడా జరిగినా.. మరు నిమిషంలో మనిషికాస్తా శవమై పోవడం గ్యారంటీ. ఇదంతా.. తమిళనాడులో జరిగే పొంగల్ మొక్కు గురించే. ఈ మొక్కు చెల్లించడమంటే… మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అసలు ఈ కాన్సెప్ట్‌ గురించి తెలిస్తే.. కొత్తవారికి కళ్లు తిరగడం ఖాయం. దేవుడి మొక్కు చెల్లడం ఏం కర్మ.. డైరెక్టుగా దేవుడి దగ్గరికే వెళ్లిపోవడానికి ఇదో దగ్గరి దారిలా కనిపిస్తుంది.

తలపై మంటలు… ఆ మంటలపై పొంగల్‌ గిన్నె… అలాగని చటుక్కున్న గిన్నె పెట్టేసి.. చటుక్కున తీసేసే సింపుల్‌ తీసే ప్రొగ్రాం కాదిది. భగభగ మండే మంటలపై పొంగల్‌ కుతకుత ఉడకాలి… ఆ తర్వాత బుసబుస పొంగాలి. అప్పుడే దాన్ని కిందికి దించేది. అప్పుడే మొక్కు తీరినట్టు. సాధారణంగా వెంట్రుకవాసిలో ప్రాణాపాయం తప్పిందని అంటుంటాం… కానీ, అదే వెంట్రుకలకు నిప్పు పెట్టేసుకున్నంత పని ఇది. వెంట్రుక వాసిలో కాదు… వ్యవహారం ఏ మాత్రం బెడిసికొట్టినా… సెకన్‌ గ్యాప్‌లో తలమొత్తం మంటల్లో కాలిపోవడం ఖాయం. తమిళనాడులో ఇదే ఆచారం.. ఇప్పుడు జనాల్ని నివ్వెరపోయేలా చేస్తుంది.  ముందుగా ఓ కొప్పును తయారు చేసి.. దానికి ఒకవైపు పూర్తిగా ఆయిల్‌ స్ప్రే చేస్తారు. ఆయిల్‌ స్ప్రే చేయని భాగాన్ని కిందివైపు ఉండేలా చేస్తారు. అలా సెట్టింగ్‌ అంతా పూర్తయ్యాక.. నిప్పు అంటించేస్తారు. దానిపై ఒక పొంగల్‌ గిన్నెను ఉంచి పొంగించేస్తారు.

ప్రమాదమని తెలిసీ.. ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్న వాళ్ల గుండె ధైర్యమా? తేడా జరిగితే ప్రాణాలు పోతాయని తెలిసినా.. మొక్కుచెల్లించుకుంటున్న ఆ పెద్దాయన ధైర్యమా? అనేది మాత్రం ఆ దేవుడికే తెలియాలి. అసలింతకూ ఈ ప్రాణాంతక మొక్కుబడి యవ్వారం జరిగే ప్లేస్‌ ఏదంటే మాత్రం.. తమిళనాడు వెళ్లాల్సిందే. కడలూరు జిల్లా వేప్పూర్‌ సమీపంలోని చేపాక్కంలో ఈ మూఢ విశ్వాసం రాజ్యమేలుతోంది. ఇక్కడ అంగళ అమ్మన్‌ ఆలయ ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఇక్కడ భక్తులు వేలాదిగా వచ్చి ఇలా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయంలో మొక్కు తీర్చుకోవడమంటే.. అది ప్రాణాలతో చెలగాటమే. తలపై పొయ్యి వెలిగించుకుని పొంగల్‌ వండటమంటే… ప్రాణాలతో చెలగాటం కాకపోతే మరేంటి? అనారోగ్యం పాలైన వారు కోలుకోవాలన్నా.. పెళ్లై ఏళ్లు గడుస్తున్న పిల్లలులేని వారికి సంతానభాగ్యం కలగాలన్నా.. ఇక్కడ మొక్కు చెల్లించుకుంటే చాలట. అందుకే, ఈ స్థాయి డేంజర్‌ జోన్‌లో మొక్కులు సమర్పిస్తుంటారు భక్తులు.

ఇక్కడి అంగళ అమ్మన్‌ దేవత చాలా పవర్‌ఫుల్‌ అని జనం ప్రగాఢంగా నమ్ముతుంటారు. ఆ నమ్మకమే.. ఈ స్థాయి తెగింపునకు కారణమైంది. ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఏదైనా కోరుకుంటే చాలు.. ఇట్టే జరిగిపోతుందట. అందుకే మాట తప్పకుండా.. ప్రాణాలు పణంగా మొక్కు చెల్లించుకుంటారు జనం. భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి చేసే ప్రయత్నం.. చేసేవారినీ, చూసేవారినీ భయపెడుతుంది. అయినా కొనసాగించి తీరాల్సిందే. లేదంటే అమ్మకు కోపం వస్తుందనే మరో భయం. నెత్తిమీద మంటలు రాజేసి… దానిపై పొంగల్‌ను 10 నిమిషాలపాటు ఉడికించడమంటే మామూలు విషయం కాదు.

ఈ మొక్కుబడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏందయ్యా బాబు.. ఏందీ వెర్రి.. భక్తి ఉండాలి గానీ.. మరీ ఇంత మూఢ భక్తా!! అనేవాళ్లు కొందరైతే.. అమ్మవారికి భక్తితో మొక్కులు చెల్లించుకుంటున్న వీళ్లెంత ధన్యులో కదా.. అనే బ్యాచ్‌ మరికొందరు. ఎవరేమన్నా.. ఈ హైటెక్‌ యుగంలో, ఇంకా ఇలాంటి మూఢాచారాల్ని పిచ్చిగా నమ్ముతుండటం బాధాకరం. భక్తి మనిషిని గొప్పగా తీర్చిదిద్దేదై ఉండాలి.. ఉన్నతస్థానాలకు చేర్చేదై ఉండాలి.. కానీ, ఇలా ప్రాణాల్ని పణంగా పెట్టేదై ఉండొద్దనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: వాహనం ఆపగా కదులుతూ కనిపించిన గోనె సంచులు.. తనిఖీ చేసిన పోలీసులు షాక్

చెవి నొప్పితో ఆస్పతికి వెళ్లిన మహిళ.. అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. తెల్లారేసరికి ఊహించని షాక్