
భానుడి ప్రతాపానికి మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పక్షులు, జంతువుల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో వడగాల్పుల ధాటికి ఏకంగా 200 గబ్బిలాలు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సాధారణంగా చెట్లకు తలకిందులుగా వేలాడుతూ ఉండే గబ్బిలాలు, ఎండ వేడిమిని తాళలేక ఒక్కసారిగా నేలరాలాయి. వందల సంఖ్యలో గబ్బిలాలు చెట్ల కింద ప్రాణాలు విడిచి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. ఒకే ప్రాంతంలో ఇలా భారీ సంఖ్యలో గబ్బిలాలు చనిపోవడం అందరినీ కలవరపాటుకు గురిచేసింది.
గత కొద్ది రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ఎండల తీవ్రత, అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఈ గబ్బిలాలు మృతి చెంది ఉంటాయని సంబంధిత అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వేడిమిని తట్టుకోలేక ఈ మూగజీవాలు ప్రాణాలు విడిచాయని భావిస్తున్నారు.
రోజురోజుకూ మారుతున్న వాతావరణ పరిస్థితులు వన్యప్రాణుల మనుగడకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం అడవి జంతువులు, పక్షులపై తీవ్రంగా పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాలను కాపాడుకునేందుకు పర్యావరణ పరిరక్షణ చర్యలు వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..